అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జిల్లాల నోటిఫికేషన్పై సర్వత్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి . అధికార పక్షంతో సహ పలు రాజకీయ పక్షాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాన్ని కాదని రాయకోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేయడాన్ని రాజంపేటలో అన్నివర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 3వేల మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఈరోజు నిరసన తెలిపారు. జిల్లా కేంద్రంగా రాయచోటిని వ్యతిరేకిస్తూ వైసీపీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కొన సాగింది.
స్థానిక ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ ప్రజల ఆందోళనను సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లి పరిష్కరించాలని కోరుతున్నారు. తాళ్లపాక అన్నమయ్య రాజంపేట మండలం తాళ్లపాకలో జన్మించారని అటువంటి రాజంపేటను కాదని రాయచోటి జిల్లా కేంద్రంగా మార్చడం అన్యాయమని స్వయాన వైసీపీకి చెందిన రాజంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లు రవి పేర్కొన్నారు. అదేవిధంగా కందుకూరును నెల్లూరు జిల్లాలో కలపడంపై వ్యతిరేకత వస్తుంది . మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని స్థానికులు కోరుతున్నారు.