అమరావతి : జీవితంలో స్థిరపడాలని ఆ యువ ఫొటోగ్రాఫర్(Photographer) కన్న కలలు నీరుగారయ్యాయి. అతడి వద్ద ఉన్న విలువైన కెమెరాలను దొంగిలించడానికి ఫొటోషూట్ (Photo Shoot) ఉందంటూ తీసుకెళ్లి దారుణంగా హత్య చేసిన విషాద ఘటన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది.
విశాఖ జిల్లా మధురవాడ బక్కన్నపాలెంకుచెందిన పోతిన సాయికుమార్(23) పెళ్లి వేడుకలకు ఫొటోలు, వీడియోలు చిత్రీకరణ చేస్తూ దూర ప్రాంతాలకు సైతం ఫొటోషూట్కు వెళ్తుంటాడు. గత నెల 26న కోనసీమ జిల్లా రావులపాలెం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు వచ్చి పదిరోజుల ఫొటోషూట్ ఉందని పిలిచారు. పెళ్లి వేడకల చిత్రీకరణకు రావులపాలెం వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి విశాఖ(Visaka) లో రైలు ఎక్కి రాజమహేంద్రవరంలో దిగాడు.
అక్కడ ఇద్దరు యువకులు కారులో వచ్చి సాయికుమార్ను రావులపాలెం ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి పూడ్చిపెట్టారు. అనంతరం అతడి వద్ద ఉన్న కెమెరా, సామగ్రిని తీసుకెళ్లారు. తల్లిదండ్రులు సాయికుమార్ కోసం ఫొన్ చేయగా స్విచ్ఆఫ్ రావడంతో విశాఖలోని పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టి మృతుడి ఫోన్ కాల్డేటా ఆధారంగా నిందితుల్లో ఒకరైన షణ్ముఖతేజను అదుపులోకి తీసుకుని విచారించారు.
ఈ విచారణలో వాస్తవాలు తెలియడంతో మరో నిందితుడు పరారీలో ఉన్నారు. కెమెరా, సామగ్రి కోసమే సాయికుమార్ను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది.