AP News | వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ చేస్తున్న మార్పులు ఆ పార్టీ నేతల్లో అసమ్మతిని తీసుకొస్తోంది. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో చేస్తున్న మార్పులు నచ్చాక పలువురు పార్టీలో నుంచి బయటకొచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు.. ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది. కాగా, శ్రీకృష్ణదేవరాయలు రాజీనామాపై పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు స్పందించారు. కృష్ణదేవరాయలుకు టికెట్ ఇవ్వకపోవడంతోనే అసంతృప్తితో రాజీనామా చేశారనే వార్తలపై వివరణ ఇచ్చారు.
శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేయడం చాలా బాధాకరమని నంబూరు శంకర్రావు అభిప్రాయపడ్డారు. సామాజిక సమీకరణాల్లో భాగంగానే శ్రీకృష్ణదేవరాయలును గుంటూరు నుంచి పోటీ చేయాలని జగన్ సూచించారని తెలిపారు. కానీ, వ్యక్తిగత కారణాలతోనే తను గుంటూరు నుంచి పోటీకి నిరాకరించారని స్పష్టం చేశారు. కృష్ణదేవరాయలుకు టికెట్ లేదని ఎవరూ చెప్పలేదని వివరించారు.