విజయవాడ: రానున్న రోజుల్లో జనసేన కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు హెచ్చరించారు. ఈ మేరకు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా జనసైనికులకు లేఖ రాశారు. పార్టీ కోర్ క్యాడర్ను అప్రమత్తం చేస్తూనే వారికి కొన్ని మార్గదర్శకాలను కూడా నాగబాబు ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్తో పాటు నాగబాబు వరుసగా ట్వీట్లు చేయడం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
నాగబాబు జారీచేసిన మార్గదర్శకాల్లో కొన్ని ఈ విధంగా ఉన్నాయి.. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొని ఉన్న తరుణంలో ప్రత్యర్థులు మైండ్ గేమ్కు తెరలు తీసినట్లు కొన్ని సంఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. జనసేన పార్టీకి పెరుగుతున్న ఆదరణను తగ్గించడానికో, కార్యకర్తల్లో గందరగోళం సృష్టించడానికో కొన్ని అనూహ్యమైన ప్రచారాలను ప్రత్యర్థులు వ్యాపింపజేస్తున్నారు. ఈ ప్రచారాలు ఏ ఫలితం ఆశించి చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? దీని వెనుక ఎవరెవరున్నారు అనే వాస్తవాలను గమనించడం లేదా నిర్ధారించుకోవడం చాలా అవసరం. సోషల్ మీడియాలో కనిపించిన ప్రతీ పోస్టుపైనా స్పందించకూడదు. ప్రత్యర్థులను నియంత్రించేందుకు మనం పెట్టే పోస్టులు సరళంగా ప్రజలకు అర్థమయ్యేలా ఆలోచింపజేసేలా ఉండాలి…’ అని నాగబాబు సూచించారు.
‘ఇప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు.. సడెన్గా మనల్ని పొగడ్డం ప్రారంభిస్తారని.. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని భావించి చప్పట్లు కొడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే అని పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా జనసేన కార్యకర్తలకు సూచించారు. ఇవన్నీ వారి మైండ్ గేమ్లో భాగమే అని గుర్తెరగండిఅంటూ హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్.