విశాఖపట్నం: తీసుకున్న అప్పు సరైన సమయానికి చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నాడని ఓ వ్యక్తిపై కోపం పెంచుకున్న ముగ్గురు వ్యక్తులు అతడ్ని దారుణంగా అంతమొందించారు. పథకం ప్రకారం కాపు కాసి కారం చల్లిన తర్వాత కత్తి, ఇనుప రాడ్తో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన విశాఖపట్నం గాజువాకలోని గోపాలరెడ్డినగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గాజువాక గోపాల రెడ్డి నగర్కు చెందిన ఛత్రబోయిన ప్రసాద్ (32) సింగపూర్లో వెల్డర్గా పనిచేస్తున్నాడు. మస్కట్ వెళ్లేందుకు వీసా కూడా పొందాడు. అయితే, ప్రసాద్ ఇటీవల తన బంధువు శ్రీను, చిన్నా, పోతురాజుల వద్ద రూ.80 వేలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు చెల్లించాలంటూ వారు తీవ్రంగా ఒత్తిడి తేవడంతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దాంతో ఆ మొత్తాన్ని త్వరలోనే తిరిగి చెల్లిస్తానని పోలీసుల ఎదుట ప్రసాద్ అంగీకరించాడు. చెప్పిన గడువు ప్రకారం ప్రసాద్ డబ్బులు చెల్లించలేదు.
ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన ప్రసాద్ మళ్లీ మరో విదేశానికి వెళ్తున్నాడని తెలుసుకున్న శ్రీను ప్రసాద్పై మరింత ఒత్తిడి పెంచాడు. అయితే, ప్రసాద్ పెద్దగా పట్టించుకోకపోవడంతో ముగ్గురు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. చివరకు ప్రసాద్ను అంతమొందించాలని పథకం పన్నారు. తన కాలనీ సమీపంలోని జనావాసాలు లేని ప్రాంతానికి వెళ్తున్న ప్రసాద్ను ముగ్గురు వ్యక్తులు అటకాయించి.. కళ్లలో కారం చల్లారు. అనంతరం కత్తి, ఇనుప రాడ్తో కొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ను రప్పించి వేలిముద్రలు సేకరించారు. నిందితులు మృతుడి సమీప బంధువులని పోలీసులు గుర్తించారు. అప్పులు, పాత గొడవల కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ముగ్గురు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని గాజువాక సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. మృతుడి తల్లిదండ్రులు, సోదరుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడీసీపీ రాజకమల్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.