కృష్ణా జిల్లా: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఓపెన్ ఛాలేంజ్ విసిరారు. తనను గుడివాడలో ఓడించడం కాదు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు గెలవాలి అని ఛాలేంజ్ చేశారు. చంద్రబాబునే కాకుండా ఆయన దత్తపుత్రుడిని కూడా చిత్తుచిత్తుగా ఓడిస్తామని శపథం చేశారాయన.
గుడివాడలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి పార్టీ ప్లీనరీలో కొడాలి నాని భావోద్వేగంతో మాట్లాడారు. ఇదే నేలపై పుట్టాను.. ఇదే మట్టిలో కలిసిపోతాను అని అన్నారు. ‘నాది గుడివాడ.. నేను 2004, 2009, 2019 లలో గెలిచాను.. 2024 లో గెలుస్తాను.. 2029 లో కూడా..‘ అంటూ ఆవేశంతో చెప్పారు. తనను గుడివాడలో ఓడిస్తానంటున్న చంద్రబాబు.. తాను కుప్పంలో గెలిచి చూపాలని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలో ఓడించి రాష్ట్ర ప్రజల, ఎన్టీఆర్ రుణం తీర్చుకుంటానని తెలిపారు. చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడలో పోటీ చేయాలన్నారు.
అన్న విగ్రహానికి ఏ రంగులైనా వేసుకోవచ్చు
ఎన్టీఆర్ ప్రజానాయకుడని, ఆయన ఏ పార్టీకి చెందిన వాడు కాదని కొడాలి నాని అన్నారు. ఆయన విగ్రహాన్ని ఎవరైనా, ఎక్కడైనా పెట్టుకోవచ్చునని, ఏ రంగులైనా వేసుకోవచ్చునన్నారు. ఎన్టీఆర్కి, టీడీపీ సంబంధం లేదని ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాయలేదా అని ప్రశ్నించారు. ఆయన నుంచి పార్టీని, పార్టీ గుర్తును లాక్కొని వెన్నుపోటు పొడిచాడని ఆరోపించారు. బొమ్ములూరులో విగ్రహం పెట్టింది తానే అని కొడాలి నాని స్పష్టం చేశారు.