తిరుపతి : తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు(Brahmotsavam ) శుక్రవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన సోమస్కంధమూర్తి (Somaskandhamurthy) , కామాక్షి అమ్మవారు, వినాయక స్వామి, చండికేశ్వరస్వామి, వల్లి, దేవసేన సమేత సుబ్రమణ్యస్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో మీన లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు.
ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ఆ తరువాత ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు, కంకణభట్టర్ మణివాసన్ గురుకుల్ మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10 రోజులపాటు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయని తెలిపారు. అనంతరం సోమస్కందమూర్తి, కామాక్షి అమ్మవారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. పల్లకీపై స్వామి, అమ్మవారు తిరుపతి పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇచ్చారు.