అమరావతి : విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు ఉద్యమంతో ప్రారంభమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ( Visakha Steel Plant ) ను ప్రైవేటీకరణ చేయడానికి వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నించిందని ఏపీ మంత్రి వంగలపూడి అనిత ( AP Minister Anitha ) వెల్లడించారు. బుధవారం ఆమె టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో కలసి విశాఖలో మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ( YS Jagan ) మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు.
స్టీల్ ప్లాంట్ను అక్కడి నుంచి తొలగించి రాజధాని నిర్మాణం చేయాలని ప్రయత్నించినట్లు సాక్షాత్తు జగన్ వద్ద సీఎస్గా పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం వెల్లడించిన వీడియోను ఆమె ప్రదర్శించారు. వైసీపీ హయాంలో దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల పాటు విశాఖ ఉక్కు ఉద్యోగులు, కార్మికులు ప్లాంట్ను కాపాడుకునేందుకు ధర్నాలు, నిరసనలు చేశారని పేర్కొన్నారు.
గత శనివారం స్టీల్ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యుద్దప్రాతిపదికన స్పందించిందని తెలిపారు. స్వయాన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, రాష్ట్రానికి చెందిన మంత్రులు ఘటనా స్థలాన్ని స్పందించడంతో పాటు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారని వివరించారు.
కోటి రూపాయలకు పైగా బాధితులకు పరిహారాన్ని ప్రకటించారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ నియమ నిబంధనలతో పనిలేకుండా పరిహారం, ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. బుధవారం బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్ జగన్ శవ రాజకీయాలకు పాల్పడడం విచారకరమని ఆరోపించారు.