తిరుపతి: శ్రీనివాసుడు భక్తులకు శ్రీకోదండరామస్వామివారి అలంకారంలో దర్శనమిచ్చాడు. శ్రీనివాస మంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీనివాసుడు శ్రీ కోదండరామస్వామివారి అలంకారంలో హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు. ఆలయంలో కరోనా నిబంధనల మేరకు వాహనసేవ ఏకాంతంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు ధనుర్బాణాలతో కల్యాణ వేంకటరాముడై హనుమంతునిపై ఆసీనుడై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారు త్రేతాయుగంలో శ్రీరాముడై అవతరించాడు.
శ్రీరాముడు హనుమంతుని భుజస్కంధాలపై అధిరోహించిన సన్నివేశాలు శ్రీమద్రామాయణంలో ఉన్నాయి. ఈ ఉత్సవంలో వాహనంగా హనుమంతుడిని, వాహనాన్ని అధిష్టించిన కల్యాణ వేంకటరాముడిని దర్శించడం వల్ల భోగమోక్షాలు, జ్ఞానవిజ్ఞానాలు, అభయారోగ్యాలు కలుగుతాయి. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు శ్రీవారి కల్యాణమండపంలో వసంతోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో గురుమూర్తి, సూపరింటెండెంట్లు చెంగల్రాయులు, రమణయ్య, ఆలయ అర్చకులు బాలాజి రంగచార్యులు పాల్గొన్నారు.