శ్రీశైలం, జూలై 23 : శ్రీశైలం మహా క్షేత్రంలో మల్లికార్జునస్వామికి ఆరుద్ర నక్షత్ర ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు స్వర్ణ రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఆలయ ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఉదయం అర్చక వేద పండితులు పంచామృతాభిషేకాలు, వివిధ రకాల ఫలోదకాలు, శుధ్ధ జలాలతో స్వామివారిని అభిషేకించి మహా బిల్వార్చన, పుష్పార్చనలు చేశారు. అదే విధంగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ మహా సంకల్పాన్ని పఠించి శాంతి మంత్రాలు వల్లించారు.
అనంతరం స్వర్ణ రథంపై ఆశీనులైన స్వామి, అమ్మవార్లకు శాస్త్రోక్త పూజలు నిర్వహించి మంగళ హారతులు సమర్పించారు. ఆలయ మహాద్వారం నుండి మాఢ వీధుల్లో విహరిస్తూ ఉత్సవం జరిగింది. రథోత్సవాన్నితిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వర్ణ రథోత్సవాన్ని ప్రతి మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు.
Srisailam : శ్రీశైల మల్లికార్జునుడికి స్వర్ణ రథోత్సవం