తిరుమల : మానవ జీవితం సమస్యల వలయమని, వీటి నుంచి బయటపడాలంటే హరినామస్మరణ ఒక్కటే మార్గమని బెంగళూరులోని కుక్కే సుబ్రమణ్య మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు. శ్రీవారి పరమభక్తుడు, కర్ణాటక సంగీత పితామహుడు శ్రీపురందరదాసుల ఆరాధన మహోత్సవాలు టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ శ్రీవేంకటేశ్వరుడు శ్రీ వైకుంఠం నుంచి తిరుమలపై కాలుమోపి సకల జీవరాశులను రక్షిస్తున్నారని అన్నారు. శ్రీ పురందరదాసులవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన ప్రతిసారి సహస్ర దళ సంకీర్తన రత్నాలతో స్వామివారి పాదపద్మాలను సేవించినట్లు తెలిపారు. శ్రీగిరి పర్వతానికి అధిపతి అయిన శ్రీనివాసుడిని సంకీర్తనలతో మేల్కొలిపే వారన్నారు. శ్రీవారి అనుగ్రహం కోసం ఆకాశరాజు శ్రీ పద్మావతి అమ్మవారిని స్వామివారికి సమర్పించినట్లు, మనం సంకీర్తనలు, మంత్రం, స్త్రోత్ర పారాయణంతో శ్రీనివాసుడి అనుగ్రహం పొందవచ్చని తెలిపారు.
అనంతరం బెంగళూరులోని రాఘవేంద్రస్వామి మఠాధిపతి సువిధ్యేంద్రతీర్థ స్వామీజీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పలువురు భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.