తిరుమల: తిరుమలలో భక్తుల(Tirumala devotees) రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆరు కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 57,354 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 24,398 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi kanukalu ) రూ. 3.40 కోట్లు వచ్చిందని తెలిపారు.
మే 5న కపిలేశ్వరాలయంలో పత్ర పుష్పయాగం
తిరుపతి కపిలేశ్వరాలయం(Tirupati Kapileshwar Temple) లో మే 5వ తేదీన పత్ర పుష్పయాగం నిర్వహించనున్నారు. ఇందుకోసం మే 4వ తేదీన సాయంత్రం అంకురార్పణ జరుగనుందని టీటీడీ అధికారులు(Ttd Officials) వెల్లడించారు. మే 5న ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు కపిలేశ్వర స్వామి, కామక్షి అమ్మవారి ఉత్సవర్లకు నవ కలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తామన్నారు.
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పత్ర పుష్పయాగ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నామని వివరించారు. ఇందులో చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, జాజి, రోజా, తామర, మల్లి, వృక్షి, కనకాంబరాలతో పాటు బిల్వ పత్రం, తులసీ, పన్నీరు ఆకులతో స్వామి, అమ్మవార్లకు పత్ర పుష్ప యాగ మహోత్సవం చేపట్టనున్నామని పేర్కొన్నారు. లోక క్షేమం కోసం, ఆలయంలో అర్చక పరిచారకులు, అధికార,అనధికారులు, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పత్ర పుష్పయాగం నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు.