తిరుమల వెంకన్న సన్నిధి భక్తులతో నిండిపోయింది. వేసవి సెలవులు పూర్తవడం దగ్గరపడే కొద్దీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో తిరుమల కిటకిటలాడుతున్నది. ఆదివారం దాటినా రద్దీ తగ్గడం లేదు. వెంకన్నను దర్శించుకుని తరించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పరిసరాల్లోని రాష్ట్రాల ప్రజలు ఎక్కువ సంఖ్యలో తిరుమలకు రావడంతో రద్దీ అంతకంతకూ పెరుగుతున్నది. భక్తులందరికీ స్వామి వారి దర్శనం కల్పించేందుకు టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
వేసవి సెలవులు పూర్తి కావస్తుండటంతో తిరుమలకు భక్తులు రద్దీ గత కొద్ది రోజుల నుంచి బాగా పెరిగింది. భక్తులకు సౌకర్యాలను సమకూర్చడంలో టీటీడీ సిబ్బంది సతమతమవుతున్నారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు కూడా వెలువడటంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశమున్నది. గతంలో ఆదివారాలు, సెలవు దినాలు మాత్రమే రద్దీ ఎక్కువగా ఉండేది. దానికి భిన్నంగా భక్తులు వస్తుండటంతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి.
స్వామి వారి దర్శనం కోసం 27 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటల సమయం పట్టనున్నది. ఇలా ఉండగా, నిన్న తిరుమల శ్రీవారిని 76,425 మంది భక్తులు దర్శించారు. 36,053 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. కాగా, భక్తులు సమర్పించిన కానుకల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.4.15 కోట్లు ఆదాయం లభించింది.