(Covid @ AP)అమరావతి: ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా గత 24 గంటల్లో ఏపీలో 130 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇవాళ కరోనా కారణంగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో 20,76,979 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీరిలో 14,493 మంది చనిపోయారు. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,61,405 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గాయి. 1,081 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
జిల్లాల వారీ డాటా ప్రకారం.. విశాఖపట్నం జిల్లాలో 30 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 18, కృష్ణాలో 18, కర్నూలులో గత 24 గంటల్లో 2 కొత్త కేసులతో అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 30,752 పరీక్షలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 3.12 కోట్ల కొవిడ్-19 పరీక్షలు నిర్వహించారు.
ఈ నెల 21 న ఏలూరు రూరల్ పత్తికోళ్ల లంకకు కువైట్ నుంచి వచ్చిన 41 ఏండ్ల మహిళకు ఒమిక్రాన్ నిర్థారణ అయినట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు ఇదే. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, హోమ్ ఐసోలేషన్లో చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గత 45 రోజుల్లో 6,856 మంది విదేశాల నుంచి జిల్లాకు వచ్చారని, వారందరికీ విమానాశ్రయంలోనే ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించగా.. 14 మందికి కొవిడ్ పాజిటివ్ వెల్లడైనట్లు కలెక్టర్ తెలిపారు. 4,200 మందికి 8 రోజుల అనంతరం మరోసారి టెస్టులు చేయగా.. ప్రైమరీ కాంటాక్ట్స్ నెగిటివ్ అని తేలాయన్నారు. మరో 2,600 మందికి 8 రోజుల వ్యవధిలో టెస్టులు చేయాల్సి ఉన్నదని, ఎవరికైనా పాజిటివ్గా తేలితే సీసీఎంబీ ల్యాబ్కు పంపుతామని కలెక్టర్ వివరించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో విదేశాల నుంచి జిల్లాకు ఎక్కువ సంఖ్యలో ప్రజలు వస్తున్నారని.. అలా వచ్చినవారెవరికైనా కొవిడ్ లక్షణాలు కనిపిస్తే 8010968295 నంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.