ఏలూరు: జిల్లా పరిధిలోని దెందులూరులో మంగళవారం రాత్రి సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్లు వైసీపీ-టీడీపీ మధ్య ఘర్షణలకు దారితీసింది. ఈ దాడిలో పోలీసు అధికారి ఒకరు కూడా గాయపడ్డారు. పట్టణంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు 144 సెక్షన్ విధించి బలగాలను మోహరించారు. అలాగే, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనను ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పట్టణంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా 144 సెక్షన్ విధించడంతోపాటు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
పోలీసులు తెలిపిన సమాచారం మేరకు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని అనుచరులుగా భావిస్తున్న మోర్ల వరకృష్ణ, సీహెచ్ సాయి అజయ్ గత 15 రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కే అబ్బయ్య చౌదరి, కన్వీనర్ కామిరెడ్డి నానిలను దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ పోస్ట్లపై వైసీపీ నాయకులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు మోర్ల వరకృష్ణను విచారించేందుకు పోలీస్స్టేషన్కు పిలిపించారు. వరకృష్ణకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న వైసీపీ నేతలను చూడగానే టీడీపీ కార్యకర్తల్లో ఆవేశం పెల్లుబికింది. ఒక్కసారిగా ఇరువర్గాలు కర్రలు, రాడ్లతో తలపడ్డాయి.
ఈ దాడిలో కామిరెడ్డి నాగభూషణం, కామిరెడ్డి రాజేష్లకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి, వీరిని అదుపుచేసేందుకు ఎస్ఐ వీర్రాజుకు స్వల్ప గాయాలయ్యాయి. ఏలూరు డీఎస్పీ పిదేశ్వరరావు, పోలీసుల బృందంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా దెందులూరులో 144 సెక్షన్ను విధించినట్లు ఏలూరు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు 200 మంది పోలీసులతో కూడిన బెటాలియన్ను దెందులూరుకు పంపారు. క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.