Jani Master | ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కూడా ఇవాళ జనసేన పార్టీలో చేరారు. పృథ్వీకి పవన్ కళ్యాణ్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
జానీ మాస్టర్ పొలిటికల్ ఎంట్రీతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అయితే నెల్లూరు జిల్లా నుంచి జానీ మాస్టర్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా.. పార్టీ కోసం ప్రచారం చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వీటిలో ఏది నిజం? జానీ మాస్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.!