టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ స్థాపించి 40 సంవత్సరాలు గడించిందని, ఇప్పుడు చంద్రబాబును వెన్నుపోటుదారు అని ఎవరూ అనడానికి వీల్లేదన్నారు. బాబును విమర్శించడానికి ఎలాంటి అంశాలు లేకే… కొందరు వెధవలు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. మంగళవారం బుద్దా వెంకన్న విలేకరులతో మాట్లాడారు.
మంత్రి కొడాలి నానికి దమ్ము ధైర్యముంటే చంద్రబాబు వెన్నుపోటుదారా? సీఎం జగన్ వెన్నుపోటుదారా? తేల్చుకుందాం రండి.. అంటూ బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. పెద్ద బహిరంగ సభ ద్వారా.. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వద్దకు పార్టీ ఎలా వచ్చిందో తాము వివరిస్తామని, వైఎస్ జగన్ పార్టీ ఎలా పెట్టారు? వైఎస్ వివేకానంద రెడ్డి నుంచి ఎలా టిక్కెట్ తీసుకున్నారన్న అంశాలు వైసీపీ వివరించాలని డిమాండ్ చేశారు.
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్, మంత్రిగా కొడాలి నాని ఉన్న ఏపీలో నివసించడం నిజంగా తమ దురదృష్టమని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. సీఎం జగన్ వద్ద మార్కులు వేసుకోడానికే మంత్రి కొడాలి నాని అలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రి కొడాలి నాని పాపాల చిట్టాను టీడీపీ నేతలు రాసుకుంటున్నారని, అవినీతినంతా బయటకు తీస్తామని బుద్ధా వెంకన్న హెచ్చరించారు.