రాజమండ్రి: అన్నను చూసేందుకు తెలంగాణ నుంచి వచ్చిన ఓ సోదరి అన్న చేతిలోనే దారుణహత్యకు గురైంది. అన్న కోరిక మేరకు కోడి కూర వండకపోవడం వల్ల ఆగ్రహానికి గురైన అన్న చేతిలోని కత్తికి ఆమె బలవడం విషాదకరం. తన ఆరోగ్యం బాగోలేనందున వంట చేయలేనని చెప్పినా వినకుండా హత్య చేయడం పట్ల గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాద ఘటన తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని కూనవరం మండలంలో చోటుచేసుకున్నది.
కూనవరం సీఐ గజేంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కూనవరం మండలంలోని కన్నాపురం గ్రామానికి చెందిన కొవ్వాసి నంద భార్యతో కలిసి గ్రామంలో నివసిస్తున్నాడు. ఈయన చెల్లెలు సోమమ్మ (20) తెలంగాణ పరిధిలోని కరకగూడెం మండలం మాదన్నగూడెంలోని తన అక్క దగ్గర ఉంటున్నది. ఇటీవల అన్నను చూసేందుకు కన్నాపురం గ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో నంద భార్య రెండ్రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. రాత్రి పూట పూటుగా మద్యం సేవించిన నంద.. ఇంటికి వస్తూ చికెన్ తెచ్చాడు. ఆరోగ్యం బాగోలేదని పడుకున్న చెల్లెలును నిద్రలేపి చికెన్ వండమని బలవంతపెట్టాడు. ఆరోగ్యం బాగా లేకున్నా చికెన్ వండాల్సిందేనని చెప్పి బయటకు వెళ్లిపోయాడు.
శుక్రవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఇంటికి వచ్చిన నంద.. చెల్లెను నిద్రలేపి కోడి కూర వడ్డించాలని ఆర్డరేశాడు. వండలేదని చెప్పడంతో నంద కోపంతో ఊగిపోయాడు. గొడ్డలి తీసుకుని ఆమెపై దాడికి యత్నించగా.. గట్టిగా ఆరుస్తూ బయటకు పరిగెత్తింది. దాంతో గొడ్డలితో వెంటపడిన నంద.. కొద్దిదూరం పరిగెత్తిన సోమమ్మపై దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. స్థానికులు నందాను పట్టుకు చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని సీఐ గజేంద్రకుమార్ దర్యాప్తు చేస్తున్నారు.