కడప జిల్లాలో అద్భుత నిర్మాణం వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలం బుగ్గ ఆగ్రహారంలోని బుగ్గమల్లేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో సొరంగ కారాగారం బయటపడింది. మైదుకూరుకు చెందిన నేస్తం సేవా సంస్థ ప్రతినిధి బాల నాగిరెడ్డి బుగ్గవంక ప్రాజెక్టును చూడటానికి వెళ్లిన సమయంలో భూమి పైభాగంలో చిన్న రంధ్రాన్ని గుర్తించారు. అందులోకి దిగి పరిశీలించగా లోపల అద్భుతమైన నిర్మాణం బయటపడింది. కడప పట్టణానికి కొద్ది దూరంలోనే ఇది ఉండడంతో వార్త తెలియగానే పలువురు అక్కడికి చేరుకుని వింతగా పరిశీలించారు.
ఈ కారాగారం బ్రిటిష్ కాలం నాటిదని చిత్తూరు, కడప పురావస్తు శాఖ ఏడీ శివకుమార్ తెలిపారు. దీన్ని బంకరుగా, గోదాంగానూ ఉపయోగించి ఉండవచ్చునన్నారు. ఇలాంటి నిర్మాణాలను బ్రిటిషర్లు రైల్వే ట్రాకు సమీపంలో నిర్మించేవారని తెలిపారు. అయితే కారాగారం లోపల ప్రస్తుతం గబ్బిలాలు, మురికి నీటితో అపరిశుభ్రంగా ఉన్నది. కారాగారం లోపలికి దిగడానికి పెద్దపెద్ద రంధ్రాలు ఉన్నాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఈ కారాగారం 1890లో బ్రిటిష్ వారు నిర్మించారు. సున్నపు రాయిని ఉపయోగించి 44 తోరణాలతో గోతిక్ శైలిలో నిర్మించిన ఈ భూగర్భ నిర్మాణాన్ని బ్రిటిష్ వారు.. తమ అవసరాలకు నీటిని నిల్వ చేయడానికి రిజర్వాయర్గా ఉపయోగించారని స్పష్టమవుతున్నది. ఈ నిర్మాణంలో నీటి నిల్వ సామర్థ్యం లక్ష లీటర్లు ఉంటుందని అధికారుల అంచనా.