AP News : రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారా.. లేదంటే గూండాల రాజ్యాన్ని నడుపుతున్నారా..? అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిలో పర్యటిస్తున్న వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడులను చంద్రబాబే స్వయంగా ఉసిగొల్పారని ఆరోపిస్తూ ‘ఎక్స్’ వేదికగా ఆయన వరుస పోస్టులు చేశారు. రాజధాని ప్రాంత రైతుల ఆహ్వానం మేరకు సీఆర్డీయే పరిరక్షణ కమిటీతో కలిసి వెళ్తున్న తమ పార్టీ నేతలపై దాడి చేయించడం ద్వారా పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హననం చేశారని మండిపడ్డారు.
కొందరు పోలీసు అధికారులు దగ్గరుండి ఈ దాడిని సమన్వయం చేయడం అత్యంత దారుణమని జగన్ విమర్శించారు. అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతి, రైతులపై సాగుతున్న దౌర్జన్యాలు బయటపడకుండా ఉండేందుకే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భూములు ఇవ్వని రైతులను భూసేకరణ నోటీసులతో వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, అక్రమంగా మట్టి తవ్వకాలు జరపడం వంటి దారుణాలకు ప్రభుత్వం ఒడిగడుతోందని జగన్ ఆరోపించారు. కొండవీటి వాగు నీటిని బలవంతంగా పొలాల్లోకి మళ్లించి, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇవాళ మీరు మొదలుపెట్టిన ఈ దుష్ట సంప్రదాయానికి భవిష్యత్తులో రెట్టింపు స్పందన ఉంటుందని జగన్ హెచ్చరించారు. ప్రజలు మిమ్మల్ని ఎన్నటికీ క్షమించరని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. పాలకుల దాడులకు వైసీపీ తలవంచదని, అమరావతి రైతులు, బాధితులకు తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని జగన్ స్పష్టంచేశారు.