అమరావతి : ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ( YS Sharmila) గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. ఉమ్మడి రాష్ట్రం విభజన సమయంలో ప్రత్యేక హోదా(Special Status) హామీ కోసం ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ జగన్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. ఈ విషయంలో తల్లిలాంటి ఏపీని జగన్ వెన్నుపోటు పొడిచారని పేర్కొన్నారు.
ప్రత్యేక హోదా కాంగ్రెస్కు ఎన్నికల అంశం కానేకాదని స్పష్టం చేశారు. పదేళ్లపాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ డిక్లరేషన్(Congress declaration) చేసిందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఏపీకి ఊపిరని దాని సాధించేందుకు అంతా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాజధాని, పోలవరం నిర్మించుకోవచ్చని సూచించారు.
హోదా కోసం పోరాడకపోతే ఎప్పటికీ రాదని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ నాడు నిరాహార దీక్షలు చేశారని, మూకుమ్మడి రాజీనామాలకు పిలుపునిచ్చారని, సీఎం అయ్యాక ఒక్కసారైనా పోరాటం చేశారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇస్తానన్న రాహుల్గాంధీ హామీతో ఏపీ రాజకీయాలోకి అడుగు పెట్టానని ఆమె వెల్లడించారు .