ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షలు, తీవ్ర గాయాలైన వారికి 5 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున నష్ట పరిహారం అందిస్తున్నట్లు ప్రకటించారు. ప్రమాదంపై పూర్తి దర్యాప్తు చేయాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
ఘటనపై సీఎస్ ఆరా..
ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఎస్ సమీర్ శర్మ ఆరా తీశారు. ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్తో ఫోన్లో సంభాషించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై దర్యాప్తు చేసి, నివేదిక సమర్పించాలని సీఎస్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు.