తాడేపల్లి : గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా పాలనను ప్రజలకు చేరువ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘ఏపీ సేవా పోర్టల్’ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ను ప్రారంభంతో ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా ప్రజల ముంగిటకు రాగలవని అభిప్రాయపడ్డారు. ఈ సేవలకు ఏపీ సేవగా నామకరణం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడున్న వ్యవస్థను మెరుగుపరచడానికి ఇది గొప్ప కార్యక్రమం అని, తద్వారా ప్రభుత్వ జవాబుదారీతనం వేగంగా, మరింత పారదర్శకంగా మారుమూల గ్రామాలలో కూడా పెరుగుతుంది అని వైఎస్ జగన్ చెప్పారు. ప్రతి 2 వేల జనాభాకు గ్రామ, వార్డు సచివాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, మొత్తం దాదాపు 4 లక్షల మంది ఈ డెలివరీ మెకానిజంలో పనిచేస్తున్నారని చెప్పారు. ఈ సేవలను మరింత మెరుగుపరచడానికి 2.0 ను ప్రారంభిస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.