అమరావతి : ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి వాడీవేడిగా ప్రారంభం కానున్నాయి. కేబినెట్లో మార్పులు, చేర్పుల తరువాత అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడం ఇదే ప్రథమం. సవరించిన మూడు రాజధాని బిల్లును ప్రవేశపెట్టడంతోపాటు పలు కీలక అంశాలు సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్న సమయంలో సమావేశాలు నిర్వహిస్తుండడం పట్ల సర్వత్ర ఆసక్తి నెలకొంది.
అధికార వికేంద్రీకరణ పేరిట రాష్ట్రంలో మూడు రాజధానులుండాలనే లక్ష్యంతో బిల్లును ప్రవేశపెట్టిన వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు కావడంతో ఆ బిల్లును ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. బిల్లులోని లోటుపాట్లను సవరించి మరోసారి ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు అమరావతి రాజధాని కోసం వెయ్యి రోజులుగా చేస్తున్న ఆందోళనలను ఉదృతం చేస్తున్నారు. దీంట్లో భాగంగా అమరావతి నుంచి అరసాపల్లి వరకు రెండవ విడత మహాపాదయాత్ర ప్రారంభించి విజయవంతంగా మూడు రోజులు పూర్తవుతుంది.
ఈ సమావేశంలో ప్రతిపక్ష టీడీపీ ఏపీకి ఏకైక రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ పట్టుబట్టే అవకాశం ఉంది. దీంతో అధికారపక్షంతో మాటల యుద్ధం కొనసాగే అవకాశాలున్నాయి. పాదయాత్రను ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకుంటారని దీన్ని స్వాగతించమంటూ ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లా మంత్రు లు హెచ్చరించిన విషయం తెలిసిందే .
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రాంతాల్లో బాధితు లకు చేయూతనందించడంలో ప్రభుత్వ వైఫల్యం, పోలవరం ప్రాజెక్టు, పులిచింతల గేటు కొట్టుకుపోవడం, రాష్ట్రంలో మద్యపాన నిషేదం, అప్పులు తదితర అంశాలపై టీడీపీ నాయకులు చర్చించాలని పట్టుబట్టే అవకాశం ఉంది.