అమరావతి : ఏపీలోని కోనసీమ జిల్లాలో జరిగిన విధ్వంసంపై ప్రభుత్వం విశ్రాంత జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే ఎందుకు గొడవలు జరుగుతున్నాయని ప్రశ్నించారు. కొందరు స్వార్థప్రయోజనాలతో అల్లర్లు సృష్టించి లబ్ధిపొందాలని చూస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ దేశవ్యాప్తంగా 42 చోట్ల అంబేద్కర్ పేరు పెట్టినా గొడవలు రాలేదని అన్నారు.
ఓట్ల కోసం చేస్తున్న రాజకీయంలో భాగంగానే కోనసీమలో గొడవలు జరుగుతున్నాయని విమర్శించారు. కొన్ని వర్గాలు కావాలనే రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మంత్రి ఇల్లు తగలబెడితే హోంమంత్రి , డీజీపీ వెళ్లి పరిశీలించరా అని నిలదీశారు. కోనసీమ ఘటనపై ప్రభుత్వం నివేదిక తెప్పించుకోదా అని ప్రశ్నించారు. గోదావరి గర్జన పేరుతో రాజమహేంద్రవరంలో ఈనెల 7న భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరవుతున్నారని ఆయన వెల్లడించారు.