ఎండాకాలం.. కోళ్లపాలిట మృత్యుకాలంగా మారుతున్నది. తీవ్రమైన వేడి.. ‘పౌల్ట్రీ’పై ప్రభావం చూపుతున్నది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లుతున్నది. ఫలితంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో కీలక పాత్ర పోషించే ‘కోళ్ల పరిశ్రమ’కుదేలవుతున్నది. ఈ నేపథ్యంలో తగిన యాజమాన్య పద్ధతులుపాటిస్తే.. వేసవి గండం నుంచి గట్టెక్కే అవకాశం ఉన్నది.
లేయర్, బ్రాయిలర్, ఇంకా ఏ రకానికి చెందినవైనా.. కోళ్లు ఉక్కపోతను తట్టుకోలేవు. అధిక వేడి, వడగాడ్పులతో మూగజీవాలు మృత్యువాత పడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వేసవిలో వ్యాధి నిరోధకశక్తి తగ్గి, త్వరగా వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంటుంది. అందుకే, ఎండాకాలం వచ్చిందంటే చాలు.. పౌల్ట్రీ పరిశ్రమ తీవ్రమైన గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో వేసవిలో కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వరంగల్ జిల్లా మామునూరు పశువైద్య పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.హనుమంతరావు సూచిస్తున్నారు.సాధారణంగా బ్రాయిలర్ కోళ్లు 21-24 డిగ్రీల సెంటీగ్రేడ్, లేయర్ కోళ్లు 30 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలను తట్టుకుంటాయి. ఈ వాతావరణంలో కోళ్ల పెరుగుదల, ఉత్పత్తుల్లో ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా ఉంటాయి. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ కోళ్ల ప్రవర్తనలో మార్పులు (సైకాలజికల్ ఛేంజెస్, పాథలాజికల్ ఛేంజెస్) కనిపిస్తాయి. తద్వారా వాటి శ్వాసలో వేగం పెరుగుతుంది. కోళ్ల దాణా వినియోగం మందగిస్తుంది. దీనివల్ల ఉత్పత్తి.. శరీర బరువు (బ్రాయిలర్), గుడ్లు(లేయర్) పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫలితంగా పరిశ్రమకు అధిక నష్టాలు వస్తాయి.
‘వేసవి’ దుష్ప్రభావాలు..
అధిక ఉష్ణోగ్రతల వల్ల మనుషులు, మిగతా జీవులతోపాటు కోళ్లు కూడా కొన్ని దుష్ప్రభావాలను ఎదుర్కొంటాయి. ముఖ్యంగా కోళ్లలో దాణా వినియోగం మందగిస్తుంది. ఫలితంగా పోషక విలువల వినియోగం తగ్గుతుంది. నీటి వినియోగం భారీగా పెరుగుతుంది. దాని ఫలితంగా శ్వాస తీవ్రత పెరిగి, కోళ్లు నోటి ద్వారా వేడిని విడుదల చేస్తాయి. వాటి నాడీ వేగం తగ్గుతుంది. రక్తపోటు పడిపోతుంది. థైరాయిడ్ గ్రంథి పరిమాణం క్షీణిస్తుంది. ఫలితంగా కిడ్నీలపై ఒత్తిడి పెరిగి, అధిక మొత్తంలో లవణాలను విసర్జిస్తాయి. చివరికి కోళ్లలో కదలిక పూర్తిగా తగ్గి, మృత్యువాత పడుతాయి.
అంతేకాకుండా, వడదెబ్బతో కోళ్ల కాలేయ పని సామర్థ్యం తగ్గుతుంది. వేడిని విడుదల చేసే ప్రక్రియలో కోళ్ల ఈకలు కూడా ఊడిపోవడం మొదలవుతుంది. షెడ్లోని అధిక ఉష్ణోగ్రతకు అధిక ఆర్ద్రత తోడైతే.. కోళ్లు రక్తపు విరేచనాలతో చనిపోయే అవకాశం ఉంటుంది. లేయర్ కోళ్లు చిన్న పరిమాణం కలిగిన గుడ్లు లేదా తోలు గుడ్లు ఎక్కువగా పెడుతాయి. బ్రీడర్ కోళ్లలో ఫలధీకరణ శాతం, పొదిగే సామర్థ్యం తగ్గుతుంది. వేసవి ఒత్తిడి వలన లింఫ్ గ్రంథులు చిన్నగా కావడం, ఫ్రీర్యాడికల్స్ విడుదల కావడం, రోగనిరోధక వ్యవస్థ క్షీణించడంతో కోళ్లు చనిపోతాయి.
ఇలా చేయాల్సిందే!
వేసవిలో కోళ్ల యాజమాన్యం మూడు పద్ధతుల్లో అవలంబిస్తారు.
1.షెడ్లో మార్పులు.
2. దాణాలో మార్పులు.
3. వ్యాధి నిరోధక చర్యలు.
‘షెడ్’.. చల్లచల్లగా!
షెడ్ నిర్మాణం తూర్పు, పడమర దిశలుగా ఉండాలి. షెడ్లలోని కోళ్లకు తగినంత గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. షెడ్లో గాలి ప్రసరణ కోసం క్రాస్ వెంటిలేషన్, రిడ్స్ వెంటిలేషన్, బాటం వెంటిలేషన్, ఫోర్స్డ్ డ్రాఫ్ట్ వెంటిలేషన్ చెయ్యాలి. షెడ్ అంచులు 3-4 ఫీట్లు పెంచాలి. పైకప్పునకు తెల్లని సున్నం వేయాలి. లేదా పైకప్పును వరి గడ్డితో కప్పివేయాలి. స్ప్రింక్లర్లతో నీటిని వెదజల్లుతూ షెడ్ల లోపలి, పైభాగం(కప్పు)ను తడుపుతూ, ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ ఉండాలి. ఫామ్ పరిసరాలలో పచ్చదనం పెంచాలి. ఈదురు గాలులను నివారించడానికి ఫామ్ చుట్టూ చెట్లు పెంచాలి. షెడ్ లోపల తుంపర్లు, ఆసిలేటింగ్ ఫ్యాన్లు అమర్చాలి. షెడ్లో కోళ్లను కిక్కిరిసేలా ఉంచకుండా, ఎక్కువ స్థల విస్తీర్ణం ఉండేలా చూసుకోవాలి.
పౌష్టికాహారమే మేలు!
వేసవిలో కోళ్లు నీటిని ఎక్కువగా తాగుతాయి. దీంతో ఆహారాన్ని తక్కువగా తీసుకుంటాయి. వర్షాకాలం, శీతాకాలాల్లో మాదిరిగా కాకుండా వేసవిలో వాటి జీర్ణశక్తి తగ్గుతుంది. దీంతో విటమిన్లు, తేలికగా జీర్ణమయ్యే ఆహారం అందించాలి. అదికూడా చల్లటి సమయం (ఉదయం, సాయంత్రం, అర్ధరాత్రి)లోనే దాణా ఇవ్వాలి. ఇందులో సులభంగా జీర్ణమయ్యే ముడిపదార్థాలు (అమైనో ఆమ్లాలు), కొవ్వులు కలపాలి. అధిక శక్తినిచ్చే పిండి పదార్థాల మోతాదును పెంచాలి. మాంసకృత్తులనిచ్చే పదార్థాలు రెండు శాతం, ఖనిజ లవణాలు, విటమిన్లు 10శాతం పెంచాలి. దాణాలో విటమిన్ ‘సి’ని తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. టన్ను దాణాలో ఒక కిలో సోడియం బైకార్బొనేట్ (తినే సోడా)ను కలుపుకోవడం ద్వారా కోళ్లలో డీహైడ్రేషన్ను నివారించవచ్చు. అదనపు క్యాల్షియం, విటమిన్ డీ3 అందించాలి. దాణా రుచిని పెంచడానికి మొలాసిస్ వంటి పదార్థాలు కలపాలి.
వ్యాధులు తట్టుకొనేలా..
వేసవి తీవ్రతకు కోళ్లలో వ్యాధి నిరోధకశక్తి సన్నగిల్లుతుంది. ఇకోలై, కొక్కెర, న్యుమోనియా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ సమయంలో కోళ్లకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి. ఎండలు తీవ్రం కావడానికి ముందే.. నట్టల మందును ఒక డోసు ఇవ్వాలి. బయట నుంచి వచ్చే వ్యాన్లు, గుడ్ల లారీలు, దాణా తీసుకొచ్చే వ్యాన్ల ద్వారా అంటువ్యాధులు వస్తాయి. వాటిని కోళ్ల ఫారంలోకి రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఫినాయిల్ కలిపిన నీటిని ఆయా వాహనాలపై పిచికారీ చేయించాలి. వ్యాధితో మరణించిన కోళ్లను కాల్చడం లేదా పూడ్చి పెట్టడం చేయాలి. షెడ్ల నుంచి తీసిన పెంటను ఎప్పటికప్పుడు తరలించాలి. దానిని ఎట్టి పరిస్థితిల్లోనూ ఫారం పరిసరాల్లో నిల్వ చేయకూడదు.
తక్షణ రక్షణ!
వడగాలి.. ఆపేయాలి!
మండే ఎండలు కోళ్లను అతలాకుతలం చేస్తాయి. ఏ జాతి కోళ్లయినా వేడికి కళ్లు తేలేస్తాయి. అందుకోసమే.. ఎండాకాలంలో పౌల్ట్రీ పరిశ్రమను జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా వేసవి వడగాలి పరిశ్రమకు మరింత ప్రమాదకరం. ఎలాంటి పరిస్థితిలోనూ వడగాల్పులను షెడ్లలోనికి రాకుండా చూడాలి. వడగాలి ఏ దిక్కు నుంచి వస్తున్నదో గుర్తించి.. అటువైపు షెడ్లను గోనె సంచులతో మూసేయాలి. ఆ సంచులను మధ్యాహ్న సమయంలో రెండుమూడు సార్లు తడపాలి. వ్యతిరేక దిక్కు నుంచి షెడ్డులోనికి వెలుతురు, గాలి వచ్చేలా చూడాలి. వేసవిలో నాటుకోళ్లతో సహా అన్ని జాతులకు కొక్కెర వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. ఇది వ్యాపిస్తే పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీని నివారణకు కోళ్లకు టీకాలు వేయించుకోవాలి.
-డాక్టర్ ఎం.హనుమంతరావు, ప్రిన్సిపాల్. పశువైద్య పాలిటెక్నిక్ కళాశాల, మామునూరు.
మజ్జిగపు శ్రీనివాస్రెడ్డి