రాష్ట్రంలో ద్రాక్ష సాగు క్రమంగా పెరుగుతున్నది. ఈసారి 5వేల ఎకరాలకు పైగా సాగు చేసేలా శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పిస్తున్నది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ద్రాక్ష సాగుకు అనుకూలంగా ఉన్నాయని ఉద్యాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చని అంటున్నారు. తెగుళ్ల నివారణ, పురుగుమందుల వాడకంపై సమీపంలోని ఉద్యాన శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
మన నేలలు అనుకూలం..
తెలంగాణ నేలలు, వాతావరణ పరిస్థితులు ద్రాక్షసాగుకు అనుకూలంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయం, అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తున్నది. ఈ ఏడాది ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు సిద్దిపేట, ఉమ్మడి మహబూబ్నగర్ వరకూ ద్రాక్ష సాగు పెరిగింది. ఇక్కడ పండించే ద్రాక్షకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఇతర జిల్లాల రైతులు కూడా ద్రాక్ష తోటలు పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారికి అవగాహన కల్పించేందుకు రాజేంద్రనగర్ రీసెర్చ్ సెంటర్ సమీపంలో ఐదెకరాల విస్తీర్ణంలో వివిధ రకాల ద్రాక్ష సాగు చేస్తున్నారు. కిస్మిస్ చారినీ, ఫ్లేమ్ సీడ్లెస్, ఏఆర్ఐ 516, మంజిరి మెడికా, ఎ 18/3 తదితర రకాలను ఇక్కడ ప్రయోగాత్మకంగా పండిస్తున్నారు. ద్రాక్ష రైతులకు సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలను వివరిస్తున్నారు.
అనేక లాభాలు..
ద్రాక్ష పండు ఆరోగ్య ప్రదాయని. దీనికి మార్కెట్లో ఏడాదంతా డిమాండ్ ఉంటుంది. అందుకే, ద్రాక్షను సాగుచేసే రైతులు అధిక లాభాలను ఆర్జిస్తుంటారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే, అధిక దిగుబడులు పొందవచ్చు. గతంలో కేవలం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకే పరిమితమైనా.. ప్రస్తుతం ఇతర జిల్లాల రైతులు కూడా ద్రాక్ష సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఈక్రమంలోనే సమీప జిల్లాల రైతాంగానికి ద్రాక్ష సాగుపై శిక్షణ ఇచ్చాం. వచ్చే ఏడాది మరింత మంది ద్రాక్ష సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నాం. ద్రాక్ష తోటలో తెగుళ్లు, సాగులో మెలకువలు, సేంద్రియ ఎరువుల వాడకం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
-డా. విజయ, ద్రాక్ష రీసెర్చ్ హెడ్ రాజేంద్రనగర్. హైదరాబాద్
-టి. మాసయ్య