‘పోషకాల గని’గా పేరొందిన ‘పాలకూర’.. అన్నదాతకు తరగని లాభాలను తెచ్చిపెడుతున్నది. చలికాలంలో పండించే ఆకుకూరల్లో.. పాలకూరే ముఖ్యమైనది. మంచు వాతావరణాన్నితట్టుకుంటూ.. మంచి దిగుబడిని అందిస్తుంది. శరీరానికి కావలసినంత శక్తిని ఇచ్చే ఈ ఆకుకూరకు.. మార్కెట్లోనూ అంతే డిమాండ్ ఉంటుంది. అందుకే.. తక్కువ సమయంలోనే చేతికి వచ్చే పాలకూర సాగుకు, రైతాంగం ఆసక్తి చూపుతున్నది.
కూరగాయల మార్కెట్ను శాసించేది ఆకుకూరలే. వీటికి 365 రోజులూ డిమాండ్ ఉంటుంది. అందుకే.. రైతులు కూరగాయ రకాల్లో మార్పులు చేసినా, ఆకుకూరలను మాత్రం పండిస్తూనే ఉంటారు. ఈ జాబితాలో ‘పాలకూర’ది ప్రథమ స్థానం. దీనిని దఫదఫాలుగా నాటుకోవడం వల్ల మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉన్నది.
పూసా ఆల్ గ్రీన్ : ఈ రకం పాలకూర పచ్చగా ఉంటుంది. ఆకులు మెత్తగా ఉంటాయి. విత్తే సమయాన్ని బట్టి ఆరు కోతల వరకూ తీయవచ్చు. ఒక హెక్టారుకు 125 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తుంది.
పూసా జ్యోతి : ఈ రకంలో ఆకులు వెడల్పుగా, మందంగా ఉంటాయి. మెత్తదనాన్ని కలిగి ఉంటుంది. మొక్కలు త్వరగా ఎదుగుతాయి. కోత కోసిన వెంటనే.. మళ్లీ పెరగడం మొదలవుతుంది. 6 నుంచి 8 కోతలు తీసుకోవచ్చు. ఒక హెక్టారుకు 200 నుంచి 400 క్వింటాళ్ల దిగుబడి అందుతుంది.
జాబ్నర్ గ్రీన్ : ఈ రకం పాలకూర ఆకులు పచ్చగా ఉంటాయి. ఆకులు మెత్తగా, దళసరిగా ఉంటాయి. ఈ రకం సువాసన కలిగి ఉంటుంది. ఒక హెక్టారుకు 270 క్వింటాళ్ల దిగుబడి అందుతుంది.
పూసా హరిత్ : ఈ రకం చల్లని ప్రాంతాల్లో సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఆకులు వెడల్పుగా ఉంటాయి. అధిక దిగుబడి పొందవచ్చు.
మురుగు నీటి వసతి ఉన్న అన్ని రకాల నేలల్లో పాలకూర సాగు చేయవచ్చు. ఇసుక నేలలు, ఒండ్రు నేలలూ అనుకూలంగా ఉంటాయి. ఆమ్ల నేలలో పెరుగుదల తక్కువగా ఉంటుంది. ఉదజని సూచిక 6 నుంచి 7 మధ్య ఉండాలి. నవంబర్ నుంచి డిసెంబర్ నెల మధ్యకాలం.. పాలకూర సాగుకు అత్యంత అనుకూలం. ఈ సమయంలో సాగు చేయడం వల్ల ఎక్కువ దిగుబడి
అందుతుంది.
నేలను 4 నుంచి 6 సార్లు మెత్తగా దున్ని, చదును చేసుకోవాలి. ఆ తర్వాత మడులు తయారు చేసుకోవాలి. పాలకూర రకాన్ని బట్టి ఒక హెక్టారుకు 28 నుంచి 35 కిలోల వరకు విత్తనాలు అవసరం. 20 సెం.మీ. ఎడంతో సాళ్లు ఏర్పాటు చేసుకొని, మొక్కల మధ్య 10 సెం.మీ. దూరం ఉండేలా 2 నుంచి 3 సెం.మీ. లోతులో విత్తనాలు వేసుకోవాలి. ఆ తర్వాత వాటిపై మట్టిని పలుచగా చల్లుకోవాలి. విత్తనాలు నాటిన 8 నుంచి 10 రోజుల్లో మొలకలు వస్తాయి. ఎక్కువ లోతు (4 సెం.మీ. మించి)లో విత్తనాలు వేస్తే.. మొలకలు రావు.
పాలకూర సాగులో ముందు దుక్కి దున్నినప్పుడు 60 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్ను ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. చివరి దుక్కిలో ఒక హెక్టారుకు 25 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువును వేయాలి. ఆకు కోత తర్వాత ఒక హెక్టారుకు 60 కిలోల నత్రజనిని ఇచ్చే ఎరువులను పైపాటుగా వేసుకోవాలి.
విత్తనాలు విత్తిన వెంటనే తేలికపాటి నీటిని అందించాలి. మళ్లీ మూడో రోజు నీటి తడి ఇవ్వాలి. ఆ తర్వాత వాతావరణ పరిస్థితులను బట్టి ప్రతి ఏడు నుంచి పది రోజులకు ఒకసారి చొప్పున నీటిని అందించాలి. అయితే, ఎక్కువ నీరు పెడితే.. పంట దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. విత్తనాలు వేసిన 20 రోజుల నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి కలుపు మొక్కలను నివారించడం తప్పనిసరి.
పాలకూరలో పేనుబంక, రసం పీల్చే పురుగుల తాకిడి అధికం. ఇవి ఎక్కువగా వ్యాపించడం వల్ల ఆకులు ముడతలు పడి, ఎండిపోతాయి. దీంతో దిగుబడి పడిపోతుంది. తోటలో వీటి వ్యాప్తిని గమనిస్తే.. లీటర్ నీటిలో 2 గ్రా. మలాథియాన్ కలిపి పిచికారీ చేయాలి. అయితే, పురుగుల మందు పిచికారీ చేసిన 7 రోజుల వరకు ఆకులను కోయవద్దు.
అధిక లాభాలను ఇచ్చే పాలకూరలో నాణ్యమైన విత్తనాల కొరత ఎక్కువ. దీంతో రైతులు స్వయంగా విత్తనాన్ని ఉత్పత్తి చేసుకుంటే మంచిది. ఇందుకోసం చేనులో సాళ్ల మధ్య 60 సెం.మీ., మొక్కల మధ్య 30 సెం.మీ. దూరం ఉండేలా విత్తనాలను వేసుకోవాలి. ప్రతి ఐదు వరుసల తర్వాత ఒక వరుసను ఖాళీగా ఉంచుకోవాలి. విత్తనం ఏర్పడ్డ దశలో, విత్తన సేకరణ సమయంలో మూడోసారి క్షేత్ర తనిఖీలు చేపట్టాలి. ఆకుల లక్షణాల ఆధారంగా విత్తనాలను ఇచ్చే మొక్కలను గుర్తించాలి. విత్తనాలు ఉదారంగులోకి మారినప్పుడు మొక్కలను కోసి, విత్తనాలను సేకరించాలి.
విత్తనాలు వేసిన 6 నుంచి 8 వారాల తర్వాత కోతకు వస్తాయి. మూడు నుంచి నాలుగు అంగుళాల పొడవు ఉన్న చివరి ఆకులను మాత్రమే కోయాలి. మొత్తం ఆకులను ఒకేసారి కాకుండా.. ఒక మొక్క నుంచి విడతలవారీగా ఆకులను కోయాలి. దీనివల్ల దిగుబడి, నాణ్యత ఎక్కువగా ఉంటుంది. ఒక మొక్క దాదాపు నాలుగు నుంచి ఆరు కోతలను ఇస్తుంది. ఒక హెక్టారుకు 80 నుంచి 100 క్వింటాళ్ల దిగుబడి అందుతుంది. పాలకూర కోసిన వెంటనే ఆకులను కట్టలుగా కట్టి వెంటనే మార్కెట్కు తరలించాలి. గింజలు కట్టకముందే ఆకులను కోయడం ముఖ్యం. లేదంటే అధిక ఉష్ణోగ్రత వల్ల పంట పూతకు వస్తుంది. దీనివల్ల ఉత్పత్తి, దిగుబడిపై ప్రభావం చూపుతుంది.
-మజ్జిగపు శ్రీనివాస్రెడ్డి