నిర్మల్, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల అర్హత పరీక్ష (టెట్) ఫీజును గతానికంటే ఐదింతలు పెంచడంపై నిరుద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక్కో పేపర్కు రూ.200ల ఫీజు ఉండగా, ప్రస్తుతం రూ.1000 పెంచారు. రెండు పేపర్లకు కలిపి రూ.2 వేల ఫీజుగా చెల్లించాలి. ఈసారి గతం కంటే భిన్నంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పేరిట పరీక్ష నిర్వహిస్తుండగా.. సరికొత్త ఆంక్షలతో నిరుద్యోగులు, ఉపాధ్యాయులను బెంబేలెత్తిస్తున్నది. గత నెల 15న నోటిఫికేషన్ జారీ అవగా.. అదేనెల 27న దరఖాస్తుల పంపిణీని చేపట్టింది. ఈ నెల 10వ తేదీ వరకు స్వీకరించేందుకు ఆఖరు తేదీగా నిర్ణయించారు. కాగా.. ఈనెల 15వ తేదీ నుంచి హాల్ టికెట్లను జారీ చేయనున్నారు. 20వ తేదీ నుంచి పరీక్ష రెండు దశలలో జూన్ 3 వరకు కొనసాగనున్నది. ఫీజు భారాన్ని తగ్గించాలని నిరుద్యోగులు, ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.
నిరుద్యోగులు, ఉపాధ్యాయుల ఆగ్రహం
ఎన్నడూ లేని విధంగా టెట్ ఫీజును కాంగ్రెస్ ప్రభుత్వం విపరీతంగా పెంచడంపై నిరుద్యోగ అభ్యర్థులు, పదోన్నతులు కోరుకునే ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదాయమే పరమావధిగా పరీక్షను నిర్వహిస్తున్నదని, ఆర్థిక భారం మోపడం సమంజసం కాదని పేర్కొంటున్నారు. ఫీజును తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. టెట్ ఫీజు విషయంలో ఆందోళన చేపట్టేందుకు కూడా నిరుద్యోగ అభ్యర్థులు, ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు.
ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి..
2010 కన్నా ముందు నియామకమైన ఉపాధ్యాయులకు, అలాగే 50 ఏళ్లు పైబడిన టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. అలాగే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు రెగ్యులర్ బీఈడీ, డైట్ అభ్యర్థులతో సమానంగా టెట్ను నిర్వహించడం సమంజసం కాదు. తప్పనిసరిగా నిర్వహించాల్సి వస్తే రెగ్యులర్ ఉపాధ్యాయుల కోసం స్పెషల్ టెట్ను నిర్వహించాలి. భాషా పండితులకు, 20 ఏళ్లుగా సర్వీసులో ఉన్నవారికి అన్ని సబ్జెక్టులపై అవగాహన ఉండని కారణంగా వారికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. అంతేకాకుండా విపరీతంగా పెంచిన ఫీజును తగ్గించాలి.
– భూమన్న యాదవ్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు, నిర్మల్.
హామీని నిలబెట్టుకోవాలి..
ఎన్నికలప్పుడు సీఎం రేవంత్రెడ్డి పోటీ పరీక్షలకు సంబంధించిన ఫీజులను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు టెట్ ఫీజును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో పేపర్కు రూ.1000 ఫీజు నిర్ణయించడం నిరుద్యోగ అభ్యర్థులకు మోయలేని భారమవుతున్నది. ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మానుకుని డీఎస్సీ కోసం గ్రంథాలయాల్లో సన్నద్ధమవుతున్న తరుణంలో దరఖాస్తు ఫీజులు పెంచడం అన్యాయం. ప్రభుత్వం ఫీజు తగ్గించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడుతాం.
– ఆనంద్బాబు, బీఈడీ, డీఈడీ అభ్యర్థుల సంఘం జిల్లా అధ్యక్షుడు, నిర్మల్.