చదువు మనిషికి మూడో కన్ను వంటిది. తనను తాను అర్థం చేసుకోవడానికి తోడ్పడడంతోపాటు, తన చుట్టూ ఉన్న పరిసరాలను, మనుషులను, సమాజాన్ని అర్థం చేసుకోడానికి దోహదపడుతుంది. విచక్షణతో నిర్ణయం తీసుకునే శక్తినిస్తుంది. విశ్లేషణాత్మక ఆలోచనలను, స్వయం నిర్ణయాధికారాన్నిస్తుంది. అందుకే మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే ప్రాథమిక అవసరాలతో సమానంగా ‘చదువు’ మన జీవితాలతో పెనవేసుకొన్నది. ‘చదువు’ పదాన్ని వ్యవహారికంగా వినియోగిస్తున్నప్పటికినీ, దీనిని విద్యకు సమానార్థకంగా కూడా వినియోగిస్తున్నారు.
గ్రంథాలయ గది, పుస్తకాలు, డిజిటల్ వసతులు, సరిపడినన్ని గదులు, అందమైన, ఆకర్షణీయమైన రంగులతో ‘సావర్ఖేడా’ బడి ముస్తాబైంది.కారణం ‘మన ఊరు-మన బడి’ కింద ఎంపికై తన రూపురేఖలను మార్చుకొన్నది. మరోవైపు నాణ్యమైన విద్యను అందించడానికి ‘తొలిమెట్టు’ కార్యక్రమం అమలవ్వడం కూడా మరొక కారణం.
మనిషి ఎదుగుదలలో పాఠశాల విద్య కీలకమైనది. అందుకే దీనిని సాధారణ విద్యగా భావించి ప్రతి ఒక్కరూ పాఠశాల విద్యను అభ్యసించాలని, అనేక దేశాలు పాఠశా ల విద్యను చట్టబద్ధం చేశాయి. ‘అందరికీ విద్య’ ను సార్వత్రికం చేశాయి. అయితే దురదృష్టవశా త్తు కరోనా మహమ్మారివల్ల అనేక రంగాలతోపాటు విద్యారంగం కూడా సంక్షోభానికి గురైం ది. పాఠశాల విద్యలో ప్రధానంగా పిల్లల మౌలి క సామర్థ్యాలు అనగా చదువగలగడం, అర్థం చేసుకోవడం, సొంతంగా రాయగలగడం, చతుర్విధ ప్రక్రియలు చేయగలగడం వంటివి కనిష్ట స్థాయికి పడిపోవడం ఆందోళనకు గురిచేసింది. ఇలాంటి సంక్షోభిత వాతావరణంలోనే ప్రారంభమైన 2021-22 విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖ ‘అభ్యసన పునరుద్ధరణ’ కన్నా పాఠశాలలు సక్రమంగా నడవడం, విద్యార్థులను బడులకు రప్పించడం, తమ పిల్లలను తల్లిదండ్రులు బడులకు పంపడం పట్ల నమ్మకం పెంపొందించడం మీద దృష్టిపెట్టింది.ఈ క్రమంలోనే 2022 జనవరిలో కరోనా మూడవసారి ‘ఒమిక్రోన్’ పేరుతో విరుచుకపడడం పరిస్థితిని మళ్ళీ మొదటికి తెచ్చింది.
ఈ సమయంలోనే దార్శనికుడు, సందర్భోచిత, సమయానుకూల చర్యలు చేపట్టే ధీరోదాత్తుడు అయిన మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు 1 నుంచి 8వ తరగతి వరకు ప్రభు త్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించడం, మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపర్చడం కోసం ‘మన ఊరు-మన బడి’/‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడుల ముఖచిత్రాన్ని మార్చి, పునర్వైభవ స్థితికి చేర్చడానికి శ్రీకారం చుట్టడం ‘చీకట్లో దీపం’లాగా అనిపించింది. ఇందుకనుగుణంగా ద్వి భాష అనగా ఆంగ్ల, మాతృభాషతో కూడిన వాచకాల రూపకల్పన జరిగింది.
ఆంగ్ల భాషలో బోధన నైపుణ్యాలను పెంపొందించడానికి అజీంప్రేంజీ
విశ్వవిద్యాలయం సహకారంతో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణాసంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు 5 వారాల పాటు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. 2021 నవంబర్లో ‘పిల్లల అభ్యసన స్థాయుల’గురించిన జాతీయ సర్వే, ప్రథం సంస్థ నిర్వహించిన సర్వేలు విద్యార్థుల అభ్యసనస్థాయులు అత్యంత ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని ప్రకటించడం గమనార్హం.
కానీ 2022-23 విద్యాసంవత్సరం ముగిం పు రోజైలైన ఏప్రిల్ 22,24 తేదీల్లో వికారాబాదు, ఆసిఫాబాదు జిల్లాల్లో, పాఠశాలల సందర్శన అనంతరం కలిగిన అనుభూతుల నేపథ్యం లో గుండెలోతుల్లోంచి వచ్చిన అభిప్రాయాలను పంచుకోవాలని అనిపించింది. అడవిమధ్య, అ ందమైన ప్రకృతి మధ్యలో ఉన్న ఒక కుగ్రా మం ‘సావర్ఖేడా’. అసిఫాబాదునుంచి 25 కి. మీ. దూరంలో ‘ఖెరిమెరి’కి వెళ్ళే ప్రధాన రహదారి నుంచి 5కి.మీ. దూరంలో రోడ్డు సౌకర్యం కూ డా పూర్తిగాలేని గ్రామం అది. ఏప్రిల్ 24న ఆ గ్రామంలో కల్మషంలేని స్వచ్ఛమైన ప్రజల మ ధ్య చిన్నారుల ఆటపాటలు, చదువు సంధ్యల ప్రదర్శనకు ‘సర్కారు బడి’ వేదికగా నిలిచింది. 150 మంది విద్యార్థులతో కళకళలాడుతున్న సర్కారుబడి ‘సావర్ ఖేడా’ ప్రాథమిక పాఠశా ల. ఆ బడి ప్రధానోపాధ్యాయుడు ‘కదెర్ల రంగయ్య’. ఆయన స్వతహాగా విధి నిర్వహణకు కం కణబద్ధుడు. ‘రంగయ్య’ సారుకు, ‘తొలిమెట్టు’ కార్యక్రమం ‘వెదుకుతున్న తీగ’ కళ్ళ ముందు కనిపించినట్టు ఒక స్పష్టమైన లక్ష్యంతో తన విద్యార్థులను తీర్చిదిద్దడానికి తోడ్పడ్డది.
ఏప్రిల్ 24న పాఠశాల చివరిదినం. సావర్ఖేడా గ్రామంలో సాయంత్రం 5 గంటలనుంచి రాత్రి 10 గంటల వరకు ‘తొలిమెట్టు’ కార్యక్ర మం ద్వారా 1-5వ తరగతుల విద్యార్థులు సా ధించిన ప్రగతిని ఆ గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ ఉన్నతాధి కారుల ముందు ప్రదర్శించడానికి ‘పిల్లల ప్రగతి ప్రదర్శన’ను ఒక బహిరంగ కార్యక్రమంగా ని ర్వ హించారు. విద్యాశాఖ సంచాలకురాలు దే వసేన, జిల్లా కలెక్టర్ హేమంత్, అదనపు కలెక్ట రు చాహత్వాజ్పేయ్, జిల్లా విద్యాశాఖాధికా రి అశోక్, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ ప్రతినిధి సు రేశ్ ఘట్టమనేనితోపాటు నేనూ పాల్గొన్నాము.
పిల్లలు ఆంగ్లంలో మాట్లాడడం, తెలుగులో రాసిన కవితలు చదువడం, పద్య పఠనం చేయ డం, గణిత నాటక ప్రదర్శన, పిల్లల బాహ్య పఠన కార్యక్రమాలతో పాటు వారు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆశ్చర్యచకితులను చేయడంతోపాటు, ప్రభుత్వ పాఠశాలల్లో చోటుచేసుకున్న ఒక నిశ్శబ్ద విప్లవాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఆవిష్కరింపచేసింది. గ్రామస్థులు, తల్లిదండ్రులు, ఎస్ఎంసీ. సభ్యు లు, సర్పంచ్ ఇలా అందరూ కల్సి సుమారు రెండు లక్షల ఖర్చుతో సొంతంగా తమ బడికోసం, తమ పిల్లల ప్రదర్శన కోసం ఆ గ్రామం లో నడుం బిగించారంటే, కారణం ‘ప్రభుత్వ పాఠశాలల్లో’ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ఫలితమని చెప్పక తప్పదు. ‘రంగయ్య’ మాస్టారు లాంటి వారి కృషి ఉన్నప్పటికీ, ఇలాం టి ఎంతో మంది ఉపాధ్యాయుల కృషిని, వారి అంకిత భావాన్ని సమాజానికి తెలియచేయ డం లో తొలిమెట్టు కార్యక్రమం ప్రధానమైన ది.
తొలిమెట్టు’ కార్యక్రమంలో పిల్లల ప్రగతి ప్రదర్శన ఒక ముఖ్యమైన అంశం. దీన్ని ప్రతి మాసంలో 3వ శనివారం రోజు ‘పీటీఎం.’ స మావేశాల్లో నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 24న వి ద్యా సంవత్సరం చివరి రోజున రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో సమావేశాలు నిర్వహించి ‘పిల్లల ప్రగతి ప్రదర్శన’ జరపాలని, వారికి ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాలని, రాబోయే సంవత్సరంలో పాఠశాలల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిం చి పిల్లల విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తారో వివరించి ఒక అర్థవంతమైన వీడ్కోలు సమావేశం ద్వారా విద్యా సంవత్సరానికి ముగింపు నివ్వాలని విద్యాశాఖ పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తం గా విద్యాశాఖాధికారులందరూ గ్రామాలకు/పాఠశాలలకు తరలివెళ్ళిన అద్భుతదృశ్యమిది.
ఏప్రిల్ 22న వికారాబాదు జిల్లా ‘గొట్టిముక్కల’ గ్రామం పాఠశాల అనుభవం కూడా! ఆ రోజు జిల్లా విద్యాశాఖాధికారి రేణుకతోపాటు మండల విద్యాధికారులు, మండల నోడల్ అధికారులు, స్కూల్ కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులతోపాటు రాష్ట్ర స్థాయి విషయ నిపుణుల బృం దం సహచరుడు వీరేశంతో కలిసి సమీక్షలో పాల్గొన్నాను. ‘తొలిమెట్టు’ కార్యక్రమంవల్ల పాఠశాలల్లో ఒక ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొన్నదని, ఉపాధ్యాయులు మంచి ఫలితాల సాధనకు కృషి చేస్తున్నారని తెలపడం విద్యాశాఖలో ‘నాణ్యతా ఉద్యమం’ చాప కింద నీరులా ప్రవహిస్తున్న తీరును బయటపెట్టింది.
అందరూ కలిసి స్వచ్ఛందంగా పిల్లలు నేర్చుకున్న దానిని వేసవి సెలవుల్లో మరిచిపోకుండా చేయడానికి ‘వేసవి పఠన శిబిరాల’ను నిర్వహించడానికి పూనుకొన్నారు. అందుకు ప్రణాళికలు వేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో గు ణాత్మక విద్య గురించి క్షేత్రస్థాయిలోని ఉపాధ్యాయులు, అధికారులు సమష్టిగా, స్వచ్ఛందంగా ముందుకు రావడమనేది శుభపరిణామం, అభినందనీయం కూడా!. స్తబ్ధత, నైరాశ్యంతో ఉన్నవారిలో సైతం పునరుత్తేజాన్ని, ఉత్సాహాన్ని నిం పి వారిని పిల్లల చదువుల గురించి పునరంకితులయ్యేలా చేయడంలో ‘తొలిమెట్టు’ విజయవంతమైందని చెప్పవచ్చు. విద్యాశాఖలోని వారిని ఒక్కతాటి మీదకు తీసుకొని రావడానికి, శాయశక్తులా, పాజిటివ్ వైఖరితో పనిచేసేలా ప్రేరేపించడానికి, ఉద్యుక్తులయ్యేలా చేయడానికి ‘తొలిమెట్టు’ ఒక బాట వేసిందని చెప్పక తప్పదు.
పిల్లల భవిష్యత్తు కోసం తమ సమస్యల కన్నా కూడా పిల్లల జీవితాలు ముఖ్యమనే భావనకు ఉపాధ్యాయులు లోనయ్యేలా
చేయడంలో ‘తొలిమెట్టు’ విజయవంతమైంది. దీనికి విద్యాశాఖ ఉన్నతాధికారుల మనోవైఖరులు ఒక కారణమైతే, ‘తొలిమెట్టు’ కార్యక్రమం రూపుదాల్చిన విధానం ప్రధానమైనది. అత్యున్నత స్థాయిలోని విద్యాశాఖ కార్యదర్శితో మొదలుకొని క్షేత్రస్థాయి ప్రధానోపాధ్యాయుడి వరకు ఒక ‘ఉమ్మడి లక్ష్యం’తో సహకార ధోరణితో కార్యక్రమం లక్ష్యాలను విస్పష్టంగా నిర్వచించుకొని కార్యాచరణ ప్రణాళికను రూ పొందించి, అమలు పరిచారు. పిల్లల కోసం కలిసి వచ్చేవారిని, స్వచ్ఛంద సంఘాలను, ఉపాధ్యాయ సంఘాలను, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయడం మరొక ముఖ్యకారణం. విద్యాశాఖామాత్యులతో మొదలుకొని ఎమ్మెల్సీలు కూడా ‘తొలిమె ట్టు’ కార్యక్రమంలో పాల్గొనడానికి సమయం కేటాయించి ప్రాధాన్యం ఇచ్చారు.
అభివృద్ధికి హేతువు చదువు కాబట్టి జిల్లా కలెక్టర్లు కూడా దీనిని ఒక ముఖ్యమైన కార్యక్రమంగా భావించి తమ జిల్లాల్లో నాయకత్వం వహించి ముందుకుతీసుకెళ్ళడంలో బాధ్యత వహిస్తున్నారు. వీటన్నింటి ఫలితంగా విద్యాశాఖలో ‘నాణ్యత’ సాధన గురించి ఆశాజనక, ప్రోత్సాహక, లక్ష్యాత్మక వాతావరణం నెలకొన్నది. దశాబ్దాల తరబడి కనబడని ఒక అద్భుతదృశ్యం ఆవిష్కరించబడింది.
‘2022-23’ సంవత్సరంలో ప్రాథమిక పా ఠశాలల్లో 1 నుంచి 5 తరగతుల వరకు పిల్లలందరూ మౌలిక భాషాగణిత సామర్థ్యాలను సా ధించడం కోసం ‘తొలిమెట్టు’ అనే కార్యక్రమా న్ని అమలుపరిచారు. పిల్లల స్థాయిని గుర్తించడానికి ప్రారంభ పరీక్ష (బేస్లైన్)తో మొదలైన కార్యక్రమంలో పిల్లలందరూ కనీసం ‘చదువ డం, రాయడం, చతుర్విధ ప్రక్రియలు చేయగలగడం’ ద్వారా ఆయా తరగతులకు నిర్దేశించి న ‘సామర్థ్యాలు-అభ్యసన’ ఫలితాలను సాధింపచేయడానికి దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రణాళిక బద్ధంగా నిర్వహించబడుతున్న కార్యక్రమం ‘తొలిమెట్టు’. ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాల వంటి అన్ని వర్గాలు ‘పిల్లల కోసం మేమంతా’ అని భావించి తమ వంతు చేయూతనిచ్చి ‘సమష్టి దృష్టి, సమష్టి బాధ్యత, సమష్టి కృషితో అమలు జరుగుతూ 2026 సం వత్సరానికి లక్ష్యాలను సాధించేదిశగా ముందు కు వెళుతున్నది ‘తొలిమెట్టు’ కార్యక్రమం.
ఇందులో ప్రధాన అంశాలు 1) విద్యార్థుల అభ్యసన స్థాయుల గురించి భేషజాలు లేకుం డా వాస్తవ పరిస్థితిని అధికారులతో మొదలుకొని ఉపాధ్యాయులందరూ అంగీకరించడం. 2) ఈ పరిస్థితిని అధిగమించడాన్ని సమష్టి బాధ్యతగా భావించడం. 3) నిర్మాణాత్మక చర్చ ల ద్వారా కార్యక్రమ విద్యావిధానాలను రూపకల్పన చేయడం. 4) గణాంకాలు, ఫలితాలు కన్నా శాస్త్రీయతతో కూడిన ప్రక్రియలు, అమలు మీద దృష్టి పెట్టడం. 5) నిరంతర మానిటరింగ్, నిర్మాణాత్మక సమీక్షలు, తక్షణ చర్యలు చేపట్ట డం. 6) ‘ఉమ్మడి లక్ష్యం’తో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతలను నిర్వర్తించడం. 7) సాంకేతికతను వినియోగించడం ద్వారా సమాచారా న్ని సేకరించి, శాస్త్రీయ విశ్లేషణలు చేపట్టి, చర్య లు తీసుకోవడం. 8) అతి ప్రధానమైంది ఉపాధ్యాయులను విశ్వసించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపటం, వారికి సహకరించే విధంగా, సమస్యలపట్ల సానుకూలంగా స్పందించి తో డ్పాటునందించే రీతిలో ‘సహకార పర్యవేక్షణ’ (Suppor tive Supervision) నిర్వహించటం. 9) ఉపాధ్యాయుల నుండి సమర్థులైన, అంకిత భావం కలవారిని విషయ నిపుణులుగా గుర్తించి, వారి సేవలను ఉపాధ్యాయులకు అందేలా చేయడం. 10) కార్యక్రమంలో అదనపు సంచాలకులు, ప్రాంతీయ సంచాలకులు, జిల్లా విద్యాధికారులు, సమగ్రశిక్ష అధికారులు, ఎస్సీ ఈఆర్టీ విద్యాశాఖ అధికారులతోపాటు ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ముఖ్యంగా తల్లిదండ్రులు భాగస్వాములు కావడం. 11) రూం టు రీడ్, సెంట్రల్ స్కేర్ ఫౌండేషన్ (సీఎస్ఎఫ్), యూనిసెఫ్ వంటి స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావడం వంటివి ప్రధానమైనవి.
ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ జూలై మా సంలో పరిస్థితిని సమీక్షించి పాఠశాల విద్య లో అత్యవసర పరిస్థితిని గమనించి ‘తొలిమెట్టు’ కార్యక్రమం గురించి విధివిధానాలను రూపొందించి అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణాసంస్థ నేతృత్వంలో అవసరమైన ఉపాధ్యాయుల శిక్ష ణ సామగ్రి, మానిటరింగ్ అధికారుల కోసం కరదీపికలు రూపొందగా, సమగ్రశిక్ష సహకారంతో 52,708 మంది ఉపాధ్యాయులకు జూలై, ఆగ ష్టు మాసాల్లో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. 23,179 ప్రాథమిక పాఠశాల ల్లో అమలుపరిచారు. 11,24,563 మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు. పాఠశాలల్లో కార్యక్రమం అమలు తీరును పరిశీలించి తగిన చర్యలు చేపట్టడానికి మండలానికి ఒకరు చొ ప్పున 602 మంది నోడల్ అధికారులను పాఠశాల విద్యాశాఖ నియమించింది. అలాగే 10 నుంచి 15 పాఠశాలలకు ఒకరు చొప్పున 1,818 మంది తో క్లస్టర్ నోడల్ అధికారుల వ్యవస్థను ఏర్పాటుచేసింది. వీరి ఆధ్వర్యంలోనే స్కూల్ కాంప్లె క్సు సమావేశాలు నిర్వహించబడుతాయి. ఇవి ఉపాధ్యాయుల వృత్తిపర సామర్థ్యాభివృద్ధి కేంద్రాలుగా కీలక పాత్రను పోషిస్తున్నాయి.
స్కూల్ కాంప్లెక్సు స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణ, సామగ్రి రూపకల్పన, మానిటరింగ్ కార్యక్రమాల్లో గుర్తించిన అకడమిక్ విషయాల పట్ల స్ప ష్టతనిచ్చి ఉపాధ్యాయులకు సహకరించేలా సబ్జెక్టువారీ విషయ నిపుణుల బృందాలు పనిచేస్తున్నాయి. ఒక్కో కాంప్లెక్సుకు 4గురు చొప్పున 1,818 స్కూల్ కాంప్లెక్సులలో 7,272 మంది కాంప్లెక్సు స్థాయి విషయ నిపుణులు, 602 మండలాల్లో మండలానికి 4గురు చొప్పున 2,408 మంది మండల స్థాయి విషయ నిపుణులు, 33 జిల్లాల్లో జిల్లాకు 4గురు చొప్పున 132 మంది జిల్లా స్థాయి విషయ నిపుణులతోపాటు 50 మంది రాష్ట్రస్థాయి విషయ నిపుణు లు (ఎస్ఆర్జీలు) సేవలందిస్తున్నారు. వీరం తా కలిపి సుమారు 10 వేల మంది విషయ నిపుణులు కంకణబద్ధులై తాము పనిచేస్తూ, ఉపాధ్యాయులకు సహకరిస్తూ కార్యక్రమానికి బాసటగా నిలుస్తుండడం అభినందనీయం.
పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో శాస్త్రీయం గా ‘తొలిమెట్టు’ కార్యక్రమం ఆరంభించబడి విజయవంతంగా అమలు జరగడం హర్షణీ యం. ఇది మరింత వేగంగా లక్ష్యాన్ని ముద్దాడడానికి పరిస్థితులను అధ్యయనం చేసి, విశ్లేషించుకొని, భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంది. అభ్యుదయ పథంలో అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం, విద్యారంగంలో కూడా అగ్రగామిగా నిలువడానికి ‘తొలిమెట్టు’ తోడ్పడుతుందని విశ్వసిస్తున్నారు. ఇది బంగారు తెలంగాణకు బాటలువేసి వేగవంతం చేయగలదని ఆశిద్దాం.
(వ్యాసకర్త : ఎన్.సి.ఇ.ఆర్.టి., జనరల్ బాడీ పూర్వ సభ్యులు, ఎస్.సి.ఇ.ఆర్.టి., కోఆర్డినేటర్)
-సువర్ణ వినాయక్