Nizamabad : నిజామాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రుల అవరణ అపరిశుభ్రతకు కేరాఫ్గా మారింది. నిత్యం వందలాది మందికి ఆరోగ్య సేవలందించే జనరల్ ఆస్పత్రి (Govt General Hospital), మాతా శిశు సంక్షేమ ఆస్పత్రి(Mata Shishi Samkshema Hospital) ప్రాంగణంలో దుర్గంధం వ్యాపిస్తోంది. బయట అడుగుపెడితే కంపు కొట్టే మురుగు కాలువ. దాంతో, కాన్పు కోసం, వైద్య పరీక్షల కోసం దవాఖానకు వచ్చిన గర్భిణులు, వారి సహాయకులు దోమలతో వేగలేకపోతున్నారు
మాతా శిశు సంక్షేమ ఆస్పత్రిలో సేవలు భేషుగ్గా ఉన్నా పరిసరాలు, ఆవరణలో పారిశుద్ధ్య నిర్వహణ మాత్రం అధ్వాన్నంగా ఉంది. ప్రధాన గేటుకు ఇరువైపులా ఓపెన్ డ్రైనేజ్, పారుతున్న ముసుగుతో ఆస్పత్రిలో దోమల బెడద.. భరించలేని దుర్వాసన. పైగా టాయిలెట్లు లేకపోవడంతో ఆవరణంతా అపరిశుభ్రతకు అద్దం పడుతోంది. చినకు పడిందంటే పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతోంది.
మాతా శిశు సంక్షేమ ఆస్పత్రి ప్రాంగణం

ఇక ప్రధాన బస్టాండ్, ప్రభుత్వ జనరల్ దవాఖానా ముందర కూడా దాదాపూ ఇదే పరిస్థితి. అదమరిచి అడుగేస్తే అంతే అన్నట్టుగా.. మూతలు లేని డ్రైనేజ్లు భయపెడుతున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇరువైపులా..

సరైన మూతల్లేని డ్రైనేజీ.. జీజీహెచ్లో తాగు నీటి పక్కనే మురుగు
