మారుమూల గ్రామాల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యం
విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు మెరుగు
ఐటీడీఏ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి
ప్రత్యేక రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న పల్లెలు
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ) : సమైక్య పాలనలో చీకట్లో మగ్గిన గిరిజనం, స్వరాష్ట్రంలో ప్రగతి బాట పడుతున్నది. ఆదివాసుల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ సర్కారు పాలన సాగిస్తున్నది. 500 జనాభా కలిగిన గూడేలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసి ‘మా ఊళ్లో.. మా రాజ్యం’ కలను సాకారం చేసింది. ఐటీడీఏ ద్వారా అనేక పథకాలు అమలు చేస్తూనే.. ఊరూరా మౌలిక వసతులు కల్పిస్తున్నది. సకల సౌకర్యాలతో పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి అడవిబిడ్డలకు కార్పొరేట్కు దీటుగా నాణ్యమైన విద్యనందిస్తున్నది. పంటల సాగుకు రైతన్నలకు ప్రోత్సాహమందిస్తూనే.. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తున్నది. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా, వారి బతుకుల్లో వచ్చిన మార్పులపై ప్రత్యేక కథనం..
ఆదివాసులకు ప్రత్యేక పథకం..
గిరిజన తెగల్లో ఆదివాసులుగా భావించే నిమ్నజాతి గిరిజనులు కొలం, తోటి, మన్నేవార్ను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా ప్రభుత్వం సీసీడీపీ ( కన్జర్వేషన్ కం కాంప్రాన్స్సీస్ డెవలప్మెంట్)అమలు చేస్తున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇందుకు సంబంధించిన 7 మండలాల్లో ని పీటీజీల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఈ మండలాల్లోని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సీసీడీపీ ద్వారా సుమారు రూ. 5 కోట్ల 20 లక్షలు వెచ్చిస్తున్నారు. అవసరాలను బట్టి తాగునీరు కల్పించేందుకు మొదటి ప్రాధా న్యం ఇస్తున్నారు. చేతిపంపుల ఏర్పాటు, తాగునీటి బావులు, నీటి ట్యాంకుల నిర్మాణాలు చేపడుతున్నారు. సాగునీటికోసం చిన్నచిన్న కుంటల నిర్మాణాలు, చెక్డ్యాంల ఏర్పాటు, సీసీ రోడ్లు, డీఆర్డిపోల ఏర్పాట్లు, విద్యుత్, అంగన్వాడీ భవనాలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు, మహిళా సంఘాలకు ఉపాధికల్పన పనులు అమలు చేస్తున్నారు. పండ్లతోటలు పెంచే రైతులకు ఐటీడీఏ ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. గిరిజన రై తులు వివిధ వాణిజ్య పంటలను వేసి నష్టపోకుండా ఉం డేందుకు వారిని పండ్ల తోటల వైపు మళ్లించి శాశ్వత ఉపా ధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నారు. పండ్ల తోటల్లో బిందు సేద్యం ద్వారా సాగునీటి వసతులు కల్పిస్తోంది. చేపల పెంపకం, వేటపై ఆధారడి జీవించే కుటుంబాలకోసం కూడా నిధులు కేటాయిస్తున్నారు.
ఐటీడీఏ ప్రణాళికలతో అభివృద్ధి బాట..
జిల్లాలో ఆదివాసులను అన్నిరంగాల్లో అభివృద్ధి పరిచేందుకు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నది. గిరిజన సంక్షేమంలో ముఖ్యమైన వ్యవసాయం, నీటిపారుదల రంగాలతో పాటు యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు చేపట్టింది. దాదాపు 18 రకాల స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తున్నారు. వీటిద్వారా గిరిజన నిరుద్యోగులకు లబ్ధి చేకూరుతున్నది. యువతకు ఉపాధి కోసం ఐటీడీఏ ద్వారా నేరుగా సబ్సిడీ రూపంలో ఆర్థిక సహాయం అందిస్తున్నది. యువతకు ఆటోలు, సెంట్రింగ్ యూనిట్లు, కాంట్రీట్ మిక్షర్ యూనిట్లు, డీటీపీ, జిరాక్స్, స్క్రీన్ ప్రింటింగ్ యూనిట్లు, కిరాణాలు, పిండిగిర్ని యూనిట్లు, పికప్వ్యాన్లు, టైలరింగ్, టెంట్ హౌస్ యూనిట్లు, ట్రాన్స్పోర్టు వాహనాలు, కూరగాయల అమ్మకపు యూనిట్లు ఉన్నాయి.
విద్యా వికాసానికి..
జిల్లాలో కార్పొరేట్ స్థాయిలో విద్యా వికాసానికి ప్రభు త్వం చర్యలు చేపడుతున్నది. జిల్లాలో కొత్తగా పాఠశాలలతో పాటు కళాశాలలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యనందిస్తున్నది. కార్పొరేట్ విద్యను మరిపించేలా సన్నబియ్యంతో రుచికరమైన భోజనం పెడుతున్నది. కుమ్రం భీం జిల్లాను అక్షరాస్యతలో మొదటి స్థానంలో నిలిపేలా చర్యలు చేపడుతున్నది.
కొత్త పంచాయతీలతో స్వయం పాలన..
జిల్లాలో కొత్త పంచాయతీల ఏర్పాటుతో ఆదివాసుల స్వయం పాలన ఆకాంక్ష నెరవేరింది. ఐదు వందల జనాభా కలిగిన గూడేలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ‘మా ఊళ్లో.. మా రాజ్యం’ కలలను సాకారం చేసింది. జిల్లాలో 173 పంచాయతీలను పునర్విభజన చేసి 334 పంచాయతీలను ఏర్పాటు చేసింది. దీంతో సుమారు 160 పంచాయతీలను గిరిజనులు పాలించుకునే అవకాశం కలిగింది. అభివృద్ధి, సంక్షేమ రంగాలతోపాటు గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో గిరిజన గ్రామాలు అభివృద్ధి బాటపట్టాయి.
జోడెఘాట్కు ప్రత్యేక గుర్తింపు
దశాబ్దాలుగా సరైన రహదారికి కూడా నోచుకోని జోడెఘాట్ గ్రామానికి రూ. 15.95 కోట్లతో రెండు వరుసల రహదారిని ప్రభుత్వం నిర్మించింది. కెరమెరి మండలం హట్టి నుంచి 23 కిలోమీటర్ల దూరంలోని జోడెఘాట్కు 8 గ్రామాలను కలుపుతూ రెండు వరుసల రహదారి నిర్మాణం పూర్తి చేసింది. జోడెఘాట్కు సరైన రోడ్డులేక ఇబ్బందులు పడుతున్న ఈ ప్రాంత వాసుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. జోడెఘాట్లో రూ. 25 కోట్లతో స్మారక చిహ్నం, గిరిజన మ్యూజియాన్ని నిర్మించి, వారి ఖ్యాతిని ప్రపంచానికి తెలిసేలా చేస్తున్నది. సంస్కృతీ సంప్రదాయాలతో పెనవేసుకున్న ఆదివాసుల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం వారి సంక్షేమానికి బాటలు వేస్తున్నది.