బేల,మే29 : మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. ఇప్పటికే కేసీఆర్ కిట్ హిట్ కావడంతో అదే స్ఫూర్తితో గర్భిణుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పౌష్టికాహార (న్యూట్రిషన్)కిట్ అందిస్తున్నది. రక్తహీనత సమస్యతో గర్భిణులు, బాలింతలు సతమతవుతున్నారు. 70 శాతానికి పైగా పౌష్టికాహార లోపమే ఇందుకు కారణమని ప్రభుత్వం గుర్తించింది. అందుకే పండంటి బిడ్డకు జన్మనిచ్చేలా చర్యలు చేపట్టింది. బేల మండలంలో 107మంది గర్భిణులకు కిట్లు పంపిణీ చేశారు.
రాష్ట్రంలోని మారుముల జిల్లాలతోపాటు గిరిజన ప్రాంతాల్లోని మహిళలకు పౌష్టికాహారం అందించేందుకుగాను ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తున్నది. ఇందుకు గాను మొదటి విడుతలో ఆదిలాబాద్ జిల్లాను ఎంపిక చేసింది. రక్తహీనత కారణంగా తల్లీబిడ్డలు అనార్యోగానికి గురికావడంతో పాటు ప్రసూతి మరణాలకు దారితీస్తున్నది. గర్భస్రావం, నెలలు నిండకుండా.. తక్కువ బరువుతో శిశువులు జన్మించడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నింటినీ గుర్తించిన ప్రభుత్వం పౌష్టికాహార కిట్లు అందజేస్తున్నది. బేల మండలంలో దాదాపు ఇప్పటికి వరకు 107 మంది గర్భిణులను గుర్తించి వారికి ఈ కిట్లను అందించింది. ప్రతి గర్భిణికి 5, 9వ నెలల్లో రెండు విడుతలుగా న్యూట్రిషన్ కిట్లను అందజేస్తున్నది. దాదాపు రూ. 2 వేల విలువైన ఈ కిట్లలో న్యూట్రిషన్ మిక్స్డ్ పౌడర్ 2 కిలోలు, కిలో ఖర్జూరాలు, 3 ఐరన్ సిరప్ సీసాలు, ప్లాస్టిక్ బుట్ట, వస్త్రం సంచి, 500 గ్రాముల నెయ్యి , ఒక కప్పు, ఆల్పెండజోల్ మాత్రలు ఉన్నాయి. బేల మండలంలో 165 మంది గర్భిణులను గుర్తించగా ఇప్పటి వరకు 107 మంది గర్భిణులకు కిట్లను అందించారు. ఈ కిట్ల పంపిణీని జిల్లా వైద్యారోగ్యశాఖ సమర్థవంతంగా నిర్వహిస్తున్నది. అంతే కాకుండా గర్భిణులు, బాలింతలకు పలు సూచనలు చేస్తున్నారు.
తల్లీబిడ్డల ఆరోగ్యమే లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం అందించిన న్యూట్రిషన్ కిట్ల ను ప్రతి గర్భిణికి అందజేస్తున్నాం. రక్తహీనత, గర్భిణు ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కిట్లను పంపిణీ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన జిల్లాల్లో ఆదిలాబాద్ జిల్లా ఉండ డం అభినందనీయం. గర్భిణులకు ఆరోగ్య సమస్యలు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం, ఈ కిట్లను వినియోగించుకొని ఆరోగ్యంగా ఉండాలి.
– డాక్టర్ వంశీకృష్ణ, బేల పీహెచ్సీ
న్యూటిష్రన్ కిట్ బాగున్నది.
ప్రభుత్వం అందజేసిన న్యూట్రిషన్ కిట్ బాగున్నది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నా. గతంలో గర్భిణులకు రక్తహీనత, పోషకాహారం తీసుకోకపోవడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. మొదటి కాన్పు సందర్భంగా ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్ అందించింది. కడుపులో బిడ్డ ఎదిగేందుకు అందించిన కిట్లు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.
-వనిత కొగ్దూర్, గర్భిణి
అన్నీ ఉచితంగానే ఇస్తున్నారు
రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై ప్రత్యేక శ్రద్ధ చూపుత్నుది. మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ పుట్టే వరకు అన్ని ఉచితంగానే అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న న్యూట్రిషన్ కిట్ బాగుంది. దీంతో గర్భిణులకు రక్తహీనత లోపం ఇబ్బందులు దూరం అవుతాయి. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. సీఎం కేసీఆర్కి మహిళలందరూ రుణపడి ఉంటాం.
-సారిక, మాంగ్రూడ్, గర్భిణి