భైంసా, జనవరి 30:విద్యార్థులు ఉన్నత లక్ష్యం తో చదువుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం మైనార్టీ విద్యార్థినులకు ఉచితంగా ఆల్ఇన్వన్ పుస్తకాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టుదలతో చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తీసుకరావాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో సుభాష్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారావు, ఎస్టీయూ టీఎస్ జనరల్ సెక్రటరీ నాగభూషణ్, హెచ్ఎం షహనాజ్ లతీఫ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పిప్పెర కృష్ణ, మాజీ వైస్ చైర్మన్ ఆసిఫ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఫారూఖ్ హైమద్, ప్రసన్న జిత్ ఆగ్రే, ఆళా, ఎంఐఎం నాయకులు ఇర్ఫాన్, మాజీద్ ఉన్నారు.
సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకోవాలి
సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, వీటిని సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. విశ్రాంతి భవనంలో ఎమ్మెల్యేను సోషల్ మీడియా వారియర్స్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు. దేశాభివృద్ది కోసం బీఆర్ఎస్ ఆవిర్భవించిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే సోషల్ మీడియా నిర్మల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దశరథ్ను సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు పొలాస సుధాకర్, కార్యదర్శులు బీరవెల్లి హరీశ్, శ్యాం, హైమద్ పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
కుంటాల, జనవరి 30 : మండల కేంద్రానికి చెందిన గొల్ల గంగారాంకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన రూ. 80వేల చెక్కును భైంసాలో ఎమ్మెల్యే జీ విఠల్రెడ్డి సోమవారం అందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ దత్తు, రైతుబంధు సమితి అధ్యక్షుడు మహేశ్, ఉప సర్పంచ్ గజేందర్ ఉన్నారు.
ఎమ్మెల్యేకు ఆహ్వానం
మండలంలోని ఓలా పంచాయతీ పరిధి రాజాపూర్లో త్వరలో నిర్వహించనున్న సేవాలాల్ వేడుకలకు హాజరు కావాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే విఠల్రెడ్డిని కలిసి ఆహ్వానించారు. సేవాలాల్ ఆలయ నిర్మాణానికి ఫిబ్రవరి 1న భూమిపూజ చేయనున్నట్లు నాయకులు హైమద్పాషా, దత్తు ఎమ్మెల్యేకు వివరించారు.