చింతలమానేపల్లి : మండలంలోని లంబడిహెట్టి గ్రామంలో పోలీసులు గురువారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర ఆధ్వర్యంలో ఇంటింటా సోదాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు కార్డెన్సెర్చ్ నిర్వహించామని అన్నారు. గ్రామంలోని పలువురు యధేచ్ఛగా గుడుంబాను జీవనాధారంగా చేసుకుని గుడుంబాను తయారు చేయడం చట్టరీత్య నేరమని వెల్లడించారు. గుడుంబా తయారీ చేసినా అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామంలో ఎవరైనా అనుమానితులు సంచరిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. సరైన పత్రాలు లేని 30 ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. వాహనాలకు సరైన పత్రాలు ఉంటే ఆధార్కార్డు , వాహన పత్రాలను తీసుకురావాలని ఆయన సూచించారు.
ఈ సోదాలో 70 లీటర్ల గుడుంబా, 3 వేల లీటర్ల బెల్లం పానకం, వంద కిలోల బెల్లంను స్వాధీనపర్చుకుని ధ్వంసం చేశామని వెల్లడించారు. ఈ కార్డెన్ సెర్చ్ లో కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్, కౌటాల సీఐ బుద్దె స్వామి, ఎస్ఐలు రవికుమార్, సాగర్, రాంమోహన్తో పాటు 13 మంది ఎస్ఐలు, వందమంది పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.