పేద విద్యార్థులకు కార్పొరేట్స్థాయి విద్య
ఎమ్మెల్యే జోగు రామన్న
బంగారుగూడలో రూ.3.50 కోట్లతో కేజీబీవీ నిర్మాణానికి భూమిపూజ
సంజయ్ నగర్లో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు..
రేషన్ కార్డుల పంపిణీ
ఆదిలాబాద్ రూరల్, జూలై 30 : మున్సిపాలిటీ పరిధిలోని బంగారుగూడను ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. బంగారుగూడలో రూ.3.50 కోట్లతో కేజీబీవీ భవన సముదాయం నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన భూమి పూజ చేశారు. ఇందుకు సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గురుకులాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసి, పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో అత్యుత్తమ విద్య అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రైవేట్కు దీటుగా కేజీబీవీల్లో బాలికలకు విద్యతో పాటు అన్ని రకాల ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. పోటీ పరీక్షలకు సైతం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని సుమారు 17 కేజీబీవీలను కళాశాలలుగా అప్గ్రేడ్ చేసి, కేజీ టూ పీజీ ఉచిత విద్యను పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం కేజీబీవీల ద్వారా ఒక్కో విద్యార్థిపై రూ.1.25 లక్షల వరకు ఖర్చుచేస్తున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు తప్పకుండా తమ పిల్లలను చేర్పించాలని సూచించారు. జిల్లాలో బాలికల విద్య తక్కువగా ఉన్నదని, బాగా చదివించాలన్నారు. అలాగే పేద విద్యార్థులకు రూ.20 లక్షలు ప్రభుత్వమే అందించి ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపిస్తున్నదని తెలిపారు. బంగారుగూడలోని ప్రభుత్వ స్థలాల్లో పేదలందరికీ ఇళ్లస్థలాలు ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, జిల్లా విద్యాశాఖాధికారి డా.రవీందర్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్లీడర్ బండారి సతీశ్, కౌన్సిలర్ విజయ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు ప్రారంభం..
ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్నగర్లో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే భూమి పూజ చేసి, ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెడుతామన్నారు. రూ.200 కోట్లతో రహదారి విస్తరణ, డివైడర్ల ఏర్పాటు, సెంట్రల్ లైటింగ్ వంటి అనేక పనులు చురుగ్గాసాగుతున్నాయని తెలిపారు. సంజయ్నగర్లో ఇప్పటి వరకు రూ.40లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కమిషనర్ శైలజ, ఈఈ వెంకట శేషయ్య, కౌన్సిలర్ షేహనాజ్బేగం, నాయకులు ఇమ్రాన్, రహీం తదితరులు పాల్గొన్నారు.
రేషన్ కార్డుల పంపిణీ..
పట్టణంలోని టీటీడీసీ సెంటర్లో ఆదిలాబాద్ రూరల్లోని వివిధ గ్రామాలకు చెందిన 385 కుటుంబాలకు ఎమ్మెల్యే రేషన్ కార్డులను పంపిణీ చేశారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే మన రాష్ట్రం టాప్లో ఉన్నదన్నారు. సీఎం కేసీఆర్ దళిత బంధు పేరుతో రూ.10వేల కోట్లతో ప్రత్యేక పథకం ప్రారంభిస్తున్నారని పేర్కొన్నారు. దీని ద్వారా ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు మంజూరుచేస్తారని తెలిపారు. వారి కుటుంబా లు సమాజంలో తలెత్తుకొని జీవించేలా చేయాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని స్పష్టం చేశారు. కానీ ఇది కేవలం హుజూరాబాద్ ఎన్నికల్లో లబ్ధికోసమేనని బీజేపీ నాయకులు ఆరోపణలు చే యడం సిగ్గుచేటన్నారు. ఆదిలాబాద్ మండలంలోని ప్రతి గ్రా మాన్నీ అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సా గుతున్నామని తెలిపారు. వచ్చే జడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఆరె నరేశ్ కుమార్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సెవ్వ లక్ష్మి, వైస్ ఎంపీపీ రమేశ్, నాయకులు సెవ్వ జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.