మొక్కలు నాటిన మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ.
కేక్ కటింగ్, అన్నదానం, పండ్లు పంపిణీ చేసిన నాయకులు
ఆదిలాబాద్, జూలై 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జన హృదయ నేత, తెలంగాణ ఐకాన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు పుట్టిన రోజు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మంత్రి అల్లోల, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, సబ్బండవర్గాలు కేక్లు కట్ చేశారు. అన్నదానం, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ముక్కోటి వృక్షార్చనలో భాగంగా భారీ సంఖ్యలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పల్లె, పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. గనులపై టీబీజీకేఎస్ నాయకులు, అధికారులు, కార్మికులు మొక్కలు నాటారు. కాగా.. ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ నిరుపేద వృద్ధ దంపతులకు ఇల్లు నిర్మించి ఇచ్చారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో కేటీఆర్ బర్త్డే సందర్భంగా శనివారం గృహ ప్రవేశం చేశారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, ప్రజలు ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి తమ అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ జిల్లా లక్ష్మణచాందలోని పీహెచ్సీ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం దవాఖానలోని రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. భైంసా ఎంపీడీవో కార్యాలయంతోపాటు మండలంలోని మాటేగాంలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఆదిలాబాద్ ఆఫీసర్స్ క్లబ్, మావల అటవీ ప్రాంతంలో ఎమ్మెల్యే జోగు రామన్న, అదనపు కలెక్టర్ డేవిడ్, డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మొక్కలు నాటారు.
నార్నూర్ మండలం తాడిహత్నూర్లో ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్ మొక్కలు నాటారు. ఇంద్రవెల్లిలో అమరవీరుల స్తూపం వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఆదిలాబాద్ విజయ డెయిరీ కార్యాలయ ఆవరణలో మాజీ ఎంపీ నగేశ్, డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్రెడ్డి మొక్కలు నాటారు. బోథ్, నేరడిగొండ మండలం కుప్టిలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, అదనపు కలెక్టర్ డేవిడ్, డీఆర్డీవో కిషన్, నాయకులు, స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. ఆదిలాబాద్ రిమ్స్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ హాజరయ్యారు. ఇచ్చోడ మండలం ముక్రా(కే)లో గ్రామస్తులు రోడ్లకు ఇరువైపులా, ఇతర ప్రాంతాల్లో రెండు వేల మొక్కలు నాటారు. పట్టణాలు, గ్రామాలు, ఖాళీ ప్రదేశాలు, ఇండ్లలో ప్రజలు మొక్కలు నాటి ముక్కోటి వృక్షార్చన విజయవంతం చేశారు.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లాలోని పాత మంచిర్యాల, హైటెక్ కాలనీ, నస్పూర్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు.. దండేపల్లి మండలంలోని కర్ణపేట రైతువేదిక వద్ద టీఆర్ఎస్ యువ నాయకులు నడిపెల్లి విజిత్రావు మొక్కలు నాటారు. శ్రీరాంపూర్ ఆర్కే-6గనిపై టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఉపాధ్యక్షుడు సురేందర్రెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్రెడ్డి కేక్ కట్ చేశారు. బెల్లంపల్లి మండలంలోని బూదాకలన్ గ్రామ పంచాయతీ పరిధిలో గల బృహత్ పల్లె ప్రకృతివనంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.. మందమర్రిలోని కేకే-5గని సమీపంలో జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, జీఎం చింతల శ్రీనివాస్ మొక్కలు నాటారు. కోటపల్లి మండల సమాఖ్య కార్యాలయంలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్ మొక్కలు నాటారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు కేక్ కట్ చేశారు. కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ముక్కోటి వృక్షార్చనలో భాగంగా బెల్లంపల్లి ఏరియా దవాఖానలో పది వేల మొక్కలు నాటారు. గోలేటి సీహెచ్పీలో ఏరియా జీఎం సంజీవరెడ్డి, గోలేటి టౌన్షిప్లో సేవా అధ్యక్షురాలు రాధాకుమారి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. సిర్పూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోనేరు కోనప్ప మొక్కలు నాటారు.