నార్నూర్, జూలై 28 : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం బెతల్గూడ గ్రామ పంచాయతీ పల్లెప్రగతి కార్యక్రమాలతో అనూహ్యంగా అభివృద్ధి చెందింది. సర్కారు అందించే నిధులను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నది. కొత్త పంచాయతీ ఏర్పడకముందు ఈ గ్రామం తాడిహత్నూర్లో విలీనంగా ఉండేది. బెతల్గూడలో 135 కుటుంబాలు, 535జనాభా ఉంది. సర్పంచ్ జాదవ్ సుజాతా పరమేశ్వర్ పంచాయతీకి ప్రతి నెలా వచ్చే రూ.77 వేలను సద్వినియోగం చేస్తూ గ్రామాన్ని ప్రగతి బాట పట్టిస్తున్నారు. రూ.20 లక్షలతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.13 లక్షలతో వైకుంఠధామం, రూ.2.50 లక్షలతో సెగ్రిగేషన్ షెడ్డు, రూ. 40 వేలతో డంప్ యార్డు నిర్మించారు. ఇంటింటికీ చెత్త బుట్టలు పంపిణీ చేశారు. పంచాయతీ ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించి డంప్ యార్డుకు తరలిస్తున్నారు. సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. ఇద్దరు పారిశుధ్య కార్మికులకు ప్రతి నెలా రూ.13,500 వేతనాలు ఇస్తున్నారు. రూ. 12 లక్షలతో పంచాయతీకి ట్రాక్టర్, వాటర్ ట్యాంకు ట్రాలీ కొనుగోలు చేశారు. పల్లెప్రకృతి వనంలో 2 వేల మొక్కలు నాటారు. ప్రధాన రహదారికి ఇరువైపులా 800 మొక్కలు నాటగా, ప్రస్తుతం అవి ఏపుగా పెరిగి ఆహ్లాదం పంచుతున్నాయి. గ్రావెల్రోడ్డు వేశారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టే కార్యక్రమాలు, పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. 2019-20లో పల్లె ప్రగతి రికార్డుల నిర్వహణలో బెతల్గూడ ఉత్తమ పంచాయతీగా ఎంపిక కాగా, అప్పటి కలెక్టర్ దివ్యాదేవరాజన్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.