మన బాణీలకు ఖండాంతరాల్లోనూ ఆదరణ లభిస్తున్నది. పాన్ ఇండియా సినిమాల్లా.. మన పాటలూ పాన్ ఇండియా, గ్లోబల్ మానియాగా మారుతున్నాయి. ఢిల్లీ పరాటా గల్లీలో, బెంగాలీ సందుల్లో, గోవా క్యాసినోల్లోనూ టాలీవుడ్ పాటలు డీజే ఎఫెక్ట్తో వినిపిస్తున్నాయి. బాహుబలి సినిమాతో డబ్బింగ్ వెర్షన్ పాటలు బాలీవుడ్కు చేరువయ్యాయి.
‘చూపే సింగారమాయెనే శ్రీవల్లీ’… ‘నైనా మాదక్ బర్ఫీ..’ ‘నా పాట చూడు.. నా ఆట చూడు’.. ‘నాచో నాచో నాచో..’.. రీమిక్స్ పాటలు కావివి. పక్కా తెలుగు పాటలు. పక్క ఇండస్ట్రీలోనూ చుక్కల్లో పక్క వేసుకొని గుక్క తిప్పుకోకుండా పాడుకుంటున్న పాటలు. టాలీవుడ్ సినిమాలే కాదు, ఆ చిత్రాల్లోని గీతాలూ హిందీ చలన చిత్ర సీమలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. బాలీవుడ్లో గెలుపు బావుట ఎగరేస్తున్న తెలుగు పాటలు ఇప్పుడు లోకల్ నుంచి గ్లోబల్ హిట్స్గా నిలుస్తున్నాయి.
‘లేకె పెహలా పెహలా ప్యార్ భర్ కే ఆంఖోమే ఖుమార్..’
‘ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది..’
***
‘యహ్ జిందగీ ఉసీ కీ హై.. జో కిసీ కా హో గయా’
‘జీవితమే సఫలమూ.. రాగసుధా భరితమూ.. ప్రేమకథా మధురమూ..’
***
‘ఓ ఖైకే పాన్ బనారస్ వాలా.. ఖుల్ జాయె బంద్ అకల్కా తాలా..’
‘ఒరబ్బీ ఏసుకున్నా కిల్లీ.. అరె అరె ఒళ్లంతా తిరిగెను మళ్లీ..’
బాలీవుడ్ కొమ్మకు పూసి టాలీవుడ్ తోటలో పరిమళించిన గీతాలివి. ఇలాంటి రీమేక్ గీతాల గురించి ఆలోచిస్తే పదుల సంఖ్యలో గుర్తుకు వస్తాయి. లోతుగా విచారిస్తే వందల పాటలు వీనులవిందు చేస్తాయి. హిందీ చిత్రసీమలో హిట్టాక్ సొంతం చేసుకున్న ఎన్నో పాటలు తెలుగులో రీమేక్ అయ్యేవి. అప్పట్లో రేడియో శ్రోతలు, అందులోనూ హిందీ ‘గీత్మాలా’ వినేవాళ్లకు మినహా.. ఆ పాట హిందీ చిత్రానిదని తెలిసేది కాదు. దీంతో బాలీవుడ్ బాణీలను మన తెలుగు వీణియపై మరింత మనోహరంగా వినిపించేవారు సంగీత దర్శకులు.
ఆది నుంచీ ఉన్నదే..
కాలం మారిపోయింది. తెలుగు పాటలు ఇంట మురిపించి రచ్చ మైమరిపిస్తున్నాయి. పాన్ ఇండియా పేరుతో టాలీవుడ్ చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నాయి. అప్పట్లో హిందీలో హిట్టయిన చిత్రాలు తెలుగులోకి, తెలుగులో బాగా ఆడిన సినిమాలు హిందీలోకి రీమేక్ చేయడం పరిపాటిగా ఉండేది. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతున్నది. అయితే, ఒకప్పుడు హిందీ, బెంగాలీ, ఇతర భాషా చిత్రాలు తెలుగులోకి ఎక్కువగా రీమేక్ అవుతుండేవి. బాలీవుడ్లో పునర్నిర్మాణమైన తెలుగు సినిమాలూ ఉన్నాయి. అయితే, ఇంతగా మీడియా లేకపోవడం, సామాజిక మాధ్యమాలు అసలే లేకపోవడంతో మూల చిత్రం ముచ్చట ఏ మూలకో వెళ్లిపోయేది. అడపాదడపా తెలుగు పాటల బాణీలూ బాలీవుడ్లో వినిపించేవి. ఆ మాటకొస్తే తెలుగు మాటలు నేరుగా వినిపించిన హిందీ చిత్ర గీతాలూ ఉన్నాయి. రాజ్కపూర్ ‘శ్రీ 420’ ప్రీ
క్లైమాక్స్లో వచ్చే
‘రామయ్యా వస్తావయ్యా.. రామయ్యా వస్తావయ్యా.. మైనే దిల్ తుఝుకో దియా’ పాట ఎవగ్రీన్ హిట్గా నిలిచింది. ఒక హిందీ పాటలో తెలుగు మాటలు వినిపించడం అదే మొదటిసారి కాబోలు. ‘శత్రంజ్’ సినిమాలో మెహమూద్, హెలెన్పై చిత్రీకరించిన ‘బతుకమ్మ బతుకమ్మ ఎక్కడ పోతావ్ రా!’ పాటలోనూ తెలుగు మాటలు ఎక్కువగానే వినిపిస్తాయి. పదేండ్ల కిందట వచ్చిన బాలీవుడ్ సినిమాలో తెలుగు పాట ‘అ అంటే అమలాపురం.. ఆ అంటే ఆహాపురం..’ అని మొదలుపెట్టి హిందీలో పాటను కొనసాగించారు.
బాలీవుడ్లో మన బాణీలు
తెలుగు మాటలు లేనప్పటికీ, మన బాణీలకు ఎప్పట్నుంచో బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. తాజాగా మన సినిమాలు పాన్ ఇండియాగా రూపొంది జాతీయ యవనికపై ప్రదర్శితం అవుతుండటంతో తెలుగు పాట పాటవం అందరికీ తెలుస్తున్నది. బాలీవుడ్ హిట్స్ లిస్ట్లో చేరిన మన బాణీలు అప్పట్లోనూ కోకొల్లలు.
1982లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రం మ్యూజికల్ హిట్గా నిలిచింది. దీనికి రాజన్-నాగేంద్ర ద్వయం సంగీత దర్శకత్వం వహించారు. ఇందులోని ‘చినుకులా రాలి.. నదులుగా సాగి..’ పాట ఎప్పుడు విన్నా కొత్తగానే ఉంటుంది. 1992లో బాలీవుడ్లో రిలీజైన ‘దీవానా’ సినిమాలో ‘ఐసీ దివానాగీ దేఖీ నహీ కహీ’ పాటకు అచ్చంగా అదే బాణీని ఉపయోగించారు సంగీత దర్శకులు నదీమ్-శ్రవణ్. పైగా ఈ పాటకు ఆ ఏడాది బెస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. పురస్కారాన్ని బాలీవుడ్ సంగీత దర్శకులు నిర్మొహమాటంగా అందుకున్నారు కూడా! చిరంజీవి హిట్ నంబర్ ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ..’ పాట ‘ధక్ ధక్ కర్నే లగా..’గా బాలీవుడ్లో విజయవంతం అయింది. ‘కూసింది కోయిలమ్మా..’ తెలుగు పాట ‘కోయల్ సే తేరి బోలీ..’గా హిందీలో కూసింది. ‘అల్లరి ప్రియుడు’ చిత్రంలోని ‘రోజ్ రోజ్.. రోజా పువ్వా’ పాట బాణీ అక్షయ్కుమార్, అజయ్ దేవగణ్ హీరోలుగా నటించిన ‘సుహాగ్’ చిత్రంలో ‘ప్యార్ ప్యార్.. మేరే యార్ యైసే హువా’ అని వినిపించింది.
ఇడియట్లో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే’ పాట హిందీకి వచ్చేసరికి ‘సావన్ మేఁ లగ్ గయీ ఆగ్ కే దిల్ మేరే హాయ్’గా యూట్యూబ్లో కోట్ల వ్యూస్ కొల్లగొట్టింది. అల్లు అర్జున్ ‘ఆర్య-2’లోని ‘రింగ రింగ రింగారే’ బాలీవుడ్లో ‘డింక చికా డింక చికా..’గా హిట్ కొట్టింది. బన్నీ ‘సీటీమార్..’ పాట అదే మకుటంతో బాలీవుడ్ బెస్ట్ పాటగా నిలిచింది. ఈ రెండు పాటలనూ సల్మాన్పైనే చిత్రీకరించారు.
పాట.. పాన్ ఇండియా
తాజాగా తెలుగు పాట విస్తృతి మరింత పెరిగింది. పుష్పతో ఆ రేంజ్ మరో స్థాయికి చేరింది. దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు, బన్నీ స్టెప్పులు, భాష మారినా మారని భావం పుష్ప పాటలకు యావత్ భారతం పుష్పాభిషేకం చేసినంత పనిచేసింది. లోకల్ జడేజా నుంచి గ్లోబల్ వార్నర్ వరకు ‘శ్రీ వల్లీ’ ఒరిజినల్ ట్రాక్ పాడుతూ, దానికి తగ్గట్టుగా ఆడుతూ అదరగొట్టారు. ఈ విన్యాసాలను వాట్సాప్లో స్టేటస్గా అప్లోడ్ చేశారు, ఇన్స్టాలో రీల్స్గా పెట్టుకున్నారు.
ఇక ‘ట్రిపుల్ ఆర్’ సినిమాకే కాదు, అందులోని పాటలకూ అంతే క్రేజ్ వచ్చింది. అన్ని భాషల్లోనూ పాటలు పండాయి. ‘నాటు నాటు’ పాట తెలుగువాడి నాటుదనంతోపాటు ప్రజెంటేషన్లో నీటుదనాన్ని బాలీవుడ్కు చాటిచెప్పింది. లేటెస్ట్గా ‘సర్కారువారి పాట’లోని కళావతి పాట కూడా డబ్బింగ్, రీమేక్ వెర్షన్ లేకుండానే పాన్ ఇండియా పాటగా హిట్ సాధించింది. పాటలకు విపరీతంగా క్రేజ్ వస్తుండటంతో ఆడియో సంస్థలు లిరికల్ వీడియోలు ప్రత్యేకంగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తున్నాయి. ఇవి కోట్ల వ్యూస్ కొల్లగొడుతూ లక్షల రూపాయల ఆదాయాన్నీ తెచ్చిపెడుతున్నాయి. ఆదాయ-వ్యయాల మాట ఎలా ఉన్నా.. తెలుగు పాట పంథా మారింది. క్లాసిక్ టచ్ తగ్గుతున్నా, మెలోడీ పాళ్లు ఇగిరిపోతున్నా.. రిథమ్, దమ్ము మన పాటను పాన్ ఇండియా స్థాయిలో నిలబెడుతున్నాయన్నది ఒప్పుకోవాల్సిన నిజం.
– కణ్వస