పాట ఆమెకు నడక నేర్పింది. సంగీతం ఆమెకు నడవడిక నేర్పింది. ఏడడుగులు, మూడుముళ్లు.. పాటగాడితోనే పంచుకునేలా చేసింది. నల్లమల నడిరాతిరి శబ్దాలే సంగీతసరిగమలై.. కృష్ణవేణి అలల తరంగాలే సాహిత్య కూర్పులై.. లింగాల నుంచి లాస్వేగాస్దాకా పాలమూరు పాట పరిమళాన్ని పరిచయం చేసి.. జానపదాన్ని ప్రాణప్రదంగా ప్రేమిస్తూతీరొక్క రాగాలు ఆలపిస్తున్న పల్లె పాటల కోయిల సునీతా జంగిరెడ్డి పాటల ముచ్చట!
మాది అచ్చంపేట దగ్గర లింగాల. సుట్టూతా నల్లమల అడవి. ఆ ప్రాంతమంతా నక్సలైట్లతో అట్టుడికిపోయేది. ఊర్లో ‘అన్నలొచ్చిండ్రు అన్నలొచ్చిండ్రు’ అనే సందడి కనిపిస్తుండె. నక్సలైట్ల పాటలు, మాటల ప్రభావం ప్రతీ కుటుంబంలో కనిపించేది. అందరిలెక్కనే మా ఇంట్ల కూడా మామయ్యలు విప్లవ గీతాలు పాడేది.
పాట కమ్మదనం
మా తాత రామస్వామి హెడ్మాస్టర్. పాఠాలే కాదు, పల్లె పాటలు కూడా నేర్పిస్తుండె. ఆయన జానపదాలు, కోలాటం, యక్షగానం పాటలు బాగా పాడుతుండె. నేను తాత దగ్గరే చదువుకున్న, పెరిగిన కాబట్టి ఆయన పాటల ప్రభావం నాపై చిన్నప్పుడే పడింది. పాట గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఏర్పడింది. ఆరో తరగతి వచ్చేసరికి షాద్నగర్ ‘కమ్మదనం గురుకులం’లో చేరిన. తాత, మామల దగ్గర నేర్చుకున్న పాటలు బడిలో పాడితే అందరూ మెచ్చుకునేటోళ్లు. నాకప్పుడు 15 ఏండ్లు. కానీ, పాట పాడితే మాత్రం నాలుగైదేండ్ల పాప పాడినట్లే అనిపించేది. అందుకే జానకమ్మ లెక్క పాడుతున్నవ్ అందురు. ‘సంగీతం నేర్చుకుంటే మంచి భవిష్యత్ ఉంటది’ అని సలహా ఇచ్చి హైదరాబాద్ త్యాగరాయ మ్యూజికల్ ఇన్స్టిట్యూట్లో చేర్పించిండ్రు. అట్లా ఇంటర్లోనే కర్ణాటక సంగీతం నేర్చుకున్నా.
జంగిరెడ్డికి జతగా
ఒకసారి ఊర్లో ఫోక్ ఈవెంట్ పెడితే చూసేందుకు పోయిన. ‘నాకూ అవకాశం వస్తే బాగుండు’ అనిపించి ఒకరిద్దర్ని అడిగిన. ‘టీమ్ లీడర్ను అడగాలె’ అన్నరు. ఎట్లనోఅట్ల తిప్పలవడి టీమ్ లీడర్ జంగిరెడ్డిని కలిసిన. ‘బాగనే పాడుతున్నవ్’ అని అవకాశం కల్పించిండు జంగిరెడ్డి. ఇక తనెక్కడ ప్రోగ్రామ్ చేసినా నన్ను తీస్కపోతుండె. జంగిరెడ్డి పరిచయంతో నా పాటల ప్రయాణం కొత్త మలుపు తిరిగింది. జానపదంపై పట్టు దొరికి ‘రేలారే రేలా’వరకు వెళ్లిన. నా పాటనే కాదు. కాంపిటీషన్స్ మొత్తంలో నేనొక ప్రత్యేక ఆకర్షణ. ‘నేపాలీ పిల్ల లెక్క ఉంటవ్’ అని అంటుండె అందరూ. కొందరైతే ఆటపట్టిస్తుండె కూడా. ‘రేలారే రేలా’లో ఉండంగనే పెండ్లయి కాంపిటీషన్స్ నుంచి బైటకు రావాల్సి వచ్చింది. ఇంతకూ నేను పెండ్లి చేసుకున్నదెవరినో కాదు. జానపదాన్ని జాతరలెక్క నడిపిస్తూ నాకూ కొంత జాగనిచ్చిన జంగిరెడ్డినే.
అన్నమాచార్య కీర్తనలూ
జీవితంలో ఏది కోల్పోయినా పాటతో మర్చిపోత. ఎక్కడి నల్లమల, ఎక్కడి లింగాల, ఎక్కడి హైదరాబాద్, ఎక్కడి అమెరికా. నా కోసం ఫ్యూచర్ ఎట్లుండాలో మా ఆయన అంతా సెట్ చేసి పెట్టిండు. మేమిద్దరం జానపదాన్ని ప్రాణపదంగా భావించేవాళ్లమే కావడంతో ఎప్పుడూ సంతోషంగా ఉంటున్నాం. ‘ఏమున్నది నా కాడ ఆడది అన్న పేరే తప్ప’ అని పాడుకుంటున్న నాకు ఓ దారి చూపించిండు. అసలైన జానపద ప్రపంచాన్ని పరిచయం చేసి ‘రాళ్ల నెకిలేసు పెట్టేటి దాననురా.. మందులోడా ఓరి మాయలోడా’ అనే పాటతో జనాల్లోకి తీసుకెళ్లిండు. ‘ఒడ్డొడ్డు గడ్డికోసి’, ‘పొదల పొదల గట్ల నడుమ’, ‘తెల్లాచీర తెల్లా రైక తెల్లవారంగా తానమా’,‘ఆయెరా మనసాయెరా’,
‘మామిడి మామిడి కాసెనా మదనా నా వయ్యారీ’ వంటివెన్నో అద్భుతమైన పాటలు పాడేలా ప్రోత్సహించిండు. జానపదాలే కాదు ‘ఏమని పొగడుదుమే ఇక నిన్ను..’ వంటి అన్నమయ్య కీర్తనలు, పెండ్లి పాటలు పాడుతున్నా.
నాయినను కలిసిన క్షణం
ఒకనాడు హైదరాబాద్లో ప్రోగ్రామ్ ఉండె. ‘బయటకు పొయ్యొద్దాం పదా’ అన్నడు జంగిరెడ్డి. లంచ్ కోసం అనుకున్నా. మేం వెళ్లే సరికి అక్కడొక పెద్దాయిన ఉన్నడు. చూస్తే నేపాలీ అనిపించింది. నన్ను అదే పనిగా చూస్తున్నడు. ‘అమ్మా బాగున్నవా?’ అన్నడు. ‘హ బాగున్న’ అన్న. ఎవరీనా అనుకున్న! ‘నేను మీ నాయినను తల్లీ’ అని చెప్పేసరికి నేను షాకైన. నా జీవితంల ‘నాయిన’ అనే పదం వినడం అదే మొదటిసారి. నాకు అమ్మ, తాతనే ప్రపంచం. అమ్మ కూలి పనిచేసి నన్ను సాదింది. కంగారుగా జంగిరెడ్డి వైపు చూసిన. ‘ఔను!’ అన్నట్లుగా తలూపిండు. అందరూ నన్ను ‘నేపాలీ పిల్ల లెక్క ఉన్నవ్’ అని ఎందుకు అనేటోళ్లో అప్పుడు అర్థమైంది. నా గతం తెలుసుకునే ప్రయత్నం చేసిన. మా నాయిన నేపాలీ. అమ్మను పెండ్లి చేసుకొని నేపాల్ తీసుకెళ్లిండు. నేను అమ్మ కడుపుల పడ్డాంక ఏమైందో గానీ, అమ్మ పాలమూరు వచ్చేసింది. నాయిన కూడా వేరే పెండ్లి చేసుకోకుండా అమ్మకోసమే ఎదురుచూసిండంట. ఆ గ్యాప్ అట్లనే కొనసాగింది. మా ఆయన అప్పుడప్పుడు నేపాలీ వాళ్లతో మాట్లాడుతుండే! విజిటింగ్ కార్డ్ ఇచ్చుడు కూడా చూసిన. కానీ అది నా కోసమనీ, నాకీ బ్యాక్గ్రౌండ్ ఉందని గానీ తెల్వకపోయేది. జంగిరెడ్డిని నేను చేసుకోకపోతే మా నాయినను కలిసే అదృష్టం ఉండకపోయేది.
మర్చిపోలేని అమెరికా యాత్ర
మలిదశ తెలంగాణ ఉద్యమంలో మొదటినుంచీ ఉన్నం. ‘సేతానమేడుందిరా’, ‘పల్లెపల్లెనా పల్లేర్లు మొలిచె’, ‘ఏరంచు ఊరు’ వంటి ప్రజాకవుల పాటలెన్నో పాడిన. జంగిరెడ్డి నాకు దేవుడిచ్చిన వరం. ఆయనను పెండ్లి చేసుకున్నంక నా జీవితం మారిపోయింది. ‘మా ప్రాణం’, ‘దరువు’, ‘స్వరాల సయ్యాట’, ‘ఫోక్స్టార్ ధూమ్ తడాకా’ వంటి టీవీ కాంపిటీషన్స్లో పాల్గొన్న. నేను వెళ్లిన ప్రతిచోటా అద్భుతమైన ప్రదర్శనలిచ్చిన. దుబాయ్, సౌతాఫ్రికాతోపాటు రసమయన్న ఆధ్వర్యంలో అమెరికా వెళ్లిన. అక్కడికి వెళ్లినప్పుడు ఏదో సాధించిన అనుభూతి కలిగింది. తెలుగు భాష పరిరక్షణ కోసం వివిధ రాష్ర్టాల్లో తిరిగిన. గానకోకిల, హంస వంటి పురస్కారాలు వచ్చినయి. ఇప్పుడు యూట్యూబ్లో పాడుకుంటూనే సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టిన.
-దాయి శ్రీశైలం