పర్యావరణం .. మానవాళి సహా సమస్త జీవరాశులు, పంచభూతాల సమాహారం. సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా, అతిసూక్ష్మ జీవులైన వైరస్కూడా అందులో భాగమే. కానీ, కరోనా నేపథ్యంలో వాటి పేరు వింటేనే హడలిపోతున్నారు జనం. బ్యాక్టీరియా జాతులలో మానవాళికి మేలు చేసేవి, పర్యావరణాన్ని సమతుల్యం చేసేవీ చాలా ఉన్నాయి. ఆ సూక్ష్మక్రిములే ఆమె నేస్తాలు. మూడు దశాబ్దాలకు పైగా వాటితో సహవాసం చేస్తున్నారు జేఎన్టీయూ అనుబంధ సంస్థ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంటల్ సెంటర్ హెడ్ ప్రొఫెసర్ శశికళ. ‘పర్యావరణ దినోత్సవం’ సందర్భంగా ఆమె ‘జిందగీ’తో మాట్లాడారు.
శశికళ తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ-కేఎల్ సుందరి. తనకు బాల్యం నుంచీ జిజ్ఞాస ఎక్కువ. అలా, సూక్ష్మజీవ శాస్త్రంపై ఆసక్తి పెరిగింది. తండ్రి విద్యుత్శాఖలో ఉద్యోగి. తరచూ బదిలీలు ఉండేవి. దీంతో, శశికళ తమిళనాడు, కర్ణాటకలలో కూడా చదివారు. ఉస్మానియాలో బీఎస్సీ, బీఎడ్ తర్వాత అప్లయిడ్ మైక్రోబయాలజీలో ఎమ్మెస్సీ చేయడానికి తమిళనాడులోని భారతీయార్ యూనివర్సిటీకి వెళ్లారు. ఉస్మానియా మైక్రోబయాలజీ విభాగం నుంచి పీహెచ్డీ చేశారు. తొలుత ఓయూలో, తర్వాత జేఎన్టీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. సహ పరిశోధకుడు వెంకటరమణను వివాహం చేసుకొన్నారు. ఇద్దరు పిల్లలు.
జేఎన్టీయూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంటల్ సెంటర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాక, శశికళ పరిశోధనలు ఊపందుకొన్నాయి. వివిధ ప్రాజెక్టులకు వచ్చిన నిధులతో, అక్కడే ఒక ల్యాబొరేటరీని ఏర్పాటు చేశారు. 30 ఏండ్లుగా పర్యావరణానికి మేలు చేసే బ్యాక్టీరియాపై పరిశోధనలు చేస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలు, ఆవాసాలపై అధ్యయనం చేసి జీవరాశికి, పర్యావరణానికి మేలుచేసే 200 కొత్త బ్యాక్టీరియాలను గుర్తించారు. వాటిలో సుమారు 20 బ్యాక్టీరియాలను ల్యాబ్లో అభివృద్ధి చేశారు. ఆ ఫలితాల్ని పలు కంపెనీలు
పరంగా అన్వయించుకున్నాయి. ప్రస్తుతం మున్సిపాలిటీలు చేపట్టిన బయోవేస్ట్ మేనేజ్మెంట్, ఫెర్టిలైజేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఆక్వాకల్చర్ తదితర విభాగాల్లో ఆమె కనుగొన్న పర్యావరణ హిత బ్యాక్టీరియాను వినియోగిస్తున్నారు. శశికళ సుమారు 240 పుస్తకాలు ప్రచురించారు. ఆమె నేతృత్వంలో ఇప్పటి వరకు 20 మంది పీహెచ్డీలు పూర్తి చేశారు.
శశికళ తన పరిశోధనల్లో మూడు బ్యాక్టీరియాలను ఆవిష్కరించారు. వాటిపై పేటెంట్ కూడా పొందారు. అందులో ప్రధానంగా ఆమె, లైకోపిన్, న్యూరోస్పిరిన్ జాతులకు చెందిన బ్యాక్టీరియాలను అభివృద్ధి చేశారు. వాటిలో ఒకటి టమాటలో ఎరుపు రంగుకు కారణమయ్యే రోడో స్పైరెల్లమ్ సఫ్యూరెక్సిజన్ బ్యాక్టీరియా. ఆహార పదార్థాలకు సహజంగా పచ్చరంగు వచ్చేందుకు దోహదపడే యాంటీ ఆక్సిడెంట్ కాంపౌండ్కు చెందిన రోడో బ్యాక్టర్ విరిడిస్, రోడో వల్లమ్ విరిడే అనే రెండు బ్యాక్టీరియాలను సైతం ఆవిష్కరించారు. ఈ మూడూ, ఆహార పరిశ్రమలో సహజ రంగుల తయారీకి ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్లు కావడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సముద్రజలాలు, మంచినీటిలో ఉండే న్యూరోస్పోరిన్, రోడో బ్యాక్టర్ హిరాయిడ్, క్యాప్సిలెటర్ నైట్రస్ వంటి బ్యాక్టీరియాలను కూడా శశికళ గుర్తించారు. ఇవి గాలిలోని నత్రజనిని అమ్మోనియాగా రూపాంతరం చెందించి, కృత్రిమ అమ్మోనియా తయారీలో కీలక పాత్రను పోషిస్తాయి. అక్వాకల్చర్లో ఈ బ్యాక్టీరియా చాలా పనికొస్తుంది. చెరువుల్లోని చేపలకోసం వేసే ఆహార వ్యర్థాల నుంచి విడుదలయ్యే నత్రజని, అమ్మోనియాలను ఈ బ్యాక్టీరియా తినేస్తాయి. దీంతో చేపలకు హాని వాటిల్లదు. చెరువులు స్వచ్ఛంగా ఉంటాయి. ఫొటోట్రోపిక్ పర్పుల్ బ్యాక్టీరియాను సైతం శశికళ అభివృద్ధి చేశారు. దీనిని పశువులకు అదనపు ఆహారంగా వాడవచ్చు. టోటల్ బ్లడ్ కొలెస్ట్రాల్ను తగ్గించేందుకూ వినియోగించొచ్చు. ప్రస్తుతం మానవులపై క్లినికల్ ట్రయల్స్ దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. తన ఆవిష్కరణలకు శశికళ అనేక పురస్కారాలూ అందుకొన్నారు.
సృష్టిలోని ప్రతి జీవిలోనూ మంచి, చెడు ఉంటాయి. అందులో ఏది ఎక్కువపాళ్లలో ఉందన్నదే ముఖ్యం. అలా పరిశీలిస్తే బ్యాక్టీరియావల్ల మనిషికి వాటిల్లే నష్టం కంటే, మేలే ఎక్కువ. బ్యాక్టీరియాలు మానవాళికి, పర్యావరణానికి ఎంతో మంచి చేస్తాయి. అవే లేకపోతే మనిషి మనుగడ అసాధ్యం. కొన్ని దేశాలు మట్టిలోని బ్యాక్టీరియాను అభివృద్ధి చేసి ట్యాబ్లెట్స్గా మార్చి ఇస్తున్నాయంటే, బ్యాక్టీరియా ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ, మనం అతిశుభ్రతకుపోతూ అన్నిటినీ సంహరిస్తున్నాం. రసాయన పదార్థాలతో ఆహారాన్ని కలుషితం చేసుకుంటున్నాం. ఒక్కమాటలో చెప్పాలంటే, తాను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాడు మనిషి. ఫలితంగా అనేక రోగాలు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుత కరోనా సంక్షోభానికి ఒక రకమైన బ్యాక్టీరియా లోపమే కారణమని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఇప్పటికైనా, మనం పర్యావరణ హితం కోరాలి. సహజ సిద్ధమైన పంటలకు ప్రాధాన్యమివ్వాలి.
–ప్రొఫెసర్ శశికళ
–మ్యాకం రవికుమార్