ప్రతి మనిషీ పంచ మహాయజ్ఞాలు నిర్వర్తించాలి. అవి భూత యజ్ఞం, మనుష్య యజ్ఞం, బ్రహ్మ యజ్ఞం, దేవ యజ్ఞం, పితృ యజ్ఞం. వీటిలో పితృయజ్ఞానికి విశేష స్థానం ఉంది. పిల్లల కోసం తల్లిదండ్రులు జీవితాలను ధారపోస్తారు. ఆ తల్లిదండ్రులకు జన్మనిచ్చిన వారి పూర్వికుల త్యాగమూ మరువలేనిది. వారందరినీ స్మరించుకునే మహోన్నత పర్వ దినాలు పితృపక్షాలు. మహాలయ అమావాస్య సందర్భంగా పితృతర్పణం, శ్రాద్ధ విధులు నిర్వర్తించడం వారసుల కర్తవ్యం. శ్రాద్ధకర్మలోని అంతరార్థాన్ని గమనిస్తే.. గతించిన పితరులు లోకాలను దాటొచ్చి, తమ బిడ్డలకు అభయమిస్తారని అవగతమవుతుంది.
భూవాతావరణాన్ని కాపాడే పనిని అష్టవసువులు చేస్తుంటారు. ఎనిమిది మంది వసువులు ఎనిమిది రకాల పనులను పర్యవేక్షిస్తుంటారు. ఆధునిక భాషలో చెప్పాలంటే అష్టవసువులు స్ట్రాటోస్ఫియర్ను రక్షిస్తుంటారు. స్ట్రాటోస్ఫియర్నే మనం వసులోకం అంటాం. వసులోకాన్ని ప్రవేశించిన ప్రేతాత్మ అష్టవసువుల ఆజ్ఞలకు లోబడి భూలోకాన్ని కాపాడుతూ ఉంటుంది.
తద్దినం పెట్టే వ్యక్తి మూడు పిండాలను పెడతాడు. అందులో మొదటిది వసులోకవాసి అయిన తల్లి లేదా తండ్రి ఆకలిని తీరుస్తుంది. రెండో పిండం నాయనమ్మ లేదా పితామహుని ఆకలిదప్పులను తీరుస్తుంది. వారు రుద్రలోకం అంటే రోదసి నివాసులు. రోదసిని ఏకాదశ రుద్రులు కాపాడుతూ ఉంటారు. తద్దినం పెడుతున్న వ్యక్తి తాత ఏకాదశ రుద్రుల ఆజ్ఞలకు లోబడి రోదసి సంరక్షణ చేస్తుంటాడు. మూడో పిండం తాతమ్మ లేదా ప్రపితామహుడు (తాత తండ్రి) ఆకలి దప్పులు తీరుస్తున్నది. వారు ఆదిత్య లోకంలో నివాసం ఉంటారు. ద్వాదశ ఆదిత్యులు ఈ లోకాలకు కావలసిన సూర్యరశ్మిని ప్రసరింపజేస్తుంటారు. ఆదిత్యరూపధారులైన జీవాత్మలు ద్వాదశాదిత్యులకు సహాయకారులుగా ఉంటూ వారు చెప్పిన పనులు చేస్తుంటారు.
తద్దినం పెట్టేవ్యక్తి మరణించి వసులోకానికి చేరుకునేటప్పుడు, అతని తండ్రి వసులోకం నుంచి రుద్ర లోకానికి, తాత రుద్రలోకం నుంచి ఆదిత్య లోకానికి, ముత్తాత ఆదిత్య లోకం నుంచి విముక్తమై కర్మఫలాన్ని అనుసరించి సాయుజ్యాన్ని పొందడమో, మళ్లీ జన్మించడమో జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రేతాత్మలు వసు, రుద్ర లోకాల నుంచే వెనుకకు మరలి పునర్జన్మ పొందడం ఉంటుంది. మనకు ఆ విషయాన్ని తెలుసుకునే సామర్థ్యం లేదు కాబట్టి మరణించిన పూర్వజులు అందరినీ వసు, రుద్ర, ఆదిత్య క్రమంలో అర్చిస్తున్నాం.
మహిళలకు ప్రత్యేకం
మరణించిన మహిళలకు పెట్టే పిండాల క్రమం ప్రత్యేకంగా ఉంటుంది. మొదటి పిండం తల్లికి, రెండోది తల్లి అత్తగారికి (నాయనమ్మకు), మూడోది నాయనమ్మ అత్తగారికి (తాతమ్మకు) పెడతారు. వివాహిత అయిన స్త్రీ సంతానం భర్త వంశానికి చెందుతుంది. కాబట్టి తల్లి జీవించి ఉండగా ప్రేమపూర్వకంగా పోషించే బాధ్యతను, ఆమె మరణించిన తర్వాత వారి ఆకలిదప్పులను తీర్చి పూజించే బాధ్యత అత్తవారింటికి చెందిన పురుషులదే! ఈ కర్తవ్యాన్ని విస్మరించకూడదని వివాహితురాలైన స్త్రీకి ఇంటిపేరును, గోత్రనామాలను మార్పించే విధానాన్ని రుషులు ఏర్పరిచారు.
శ్రాద్ధ విధి ఇలా..
పితృకార్యాన్ని చేసే కర్తకు మార్గదర్శనం చేసే బ్రాహ్మణుడిది విష్ణుస్థానం. కార్యక్రమం జరిగినంత సేపూ శ్రీ మహావిష్ణువు ఆ వ్యక్తిని ఆవహించి ఉంటాడన్నమాట. ముగ్గురు భోక్తలు పితృస్థానంలో ఉండాలి. అశక్తత, అలభ్యతల కారణంగా తండ్రి, తాత, ముత్తాతలకు ప్రతిరూపంగా ఒకే భోక్తను పిలుచుకుంటున్నాం. తద్దినంలో ఆ భోక్త చేసే భోజన సారం మన పితరులకు చెందుతుంది. మనం ఇచ్చే దక్షిణ సత్కారాలతో ఆ బ్రాహ్మణుడితోపాటు పితృదేవతలు కూడా సంతృప్తి చెందుతారు. మన పూర్వికుల జీవాత్మలు ఆయాలోకాలలో ఉంటే వారే స్వయంగా ఆ బ్రాహ్మణుడిని ఆశ్రయించి కార్యక్రమ నిర్వహణలో మనకుగల శ్రద్ధాసక్తులను గమనించి, ఆనందించి ఆశీర్వదిస్తారు. ఒకవేళ వారి జీవాత్మలు ఆయాలోకాల్లోంచి నిష్క్రమించి ఉంటే, సాక్షాత్తు వసు, రుద్ర, ఆదిత్యులే మనలను ఆశీర్వదించడానికి వస్తారు. క్రియలో గానీ, భక్తిశ్రద్ధలలో గాని ఏర్పడ్డ లోపాలను పితృదేవతలు క్షమిస్తారేమో గానీ, వారి స్థానంలో వచ్చిన వసు, రుద్ర, ఆదిత్య దేవతలు అస్సలు క్షమించరు. కాబట్టి పితృకార్యాన్ని చేసేవారు నిబద్ధతతో మెలగాలి.
ఎవరీ విశ్వేదేవతలు?
ధర్ముని భార్య విశ్వ. ఆమె దక్ష ప్రజాపతి, అసిక్ని కుమార్తె. విశ్వకు పన్నెండు మంది కొడుకులు. వారిని విశ్వేదేవతలు అంటారు. వీరు పితృదేవతల యోగక్షేమాలను విచారిస్తుంటారు. మనం నెరవేర్చే పితృకార్య ఫలాలను ఆయాలోకాల్లో ఉన్న పితృదేవతలకు, పునర్జన్మ ఎత్తి మరొక జీవనాన్ని కొనసాగిస్తున్న వారికి సైతం అందిస్తుంటారు. అలాగే వారి ఆశీస్సులను మనకు అందజేస్తారు. ఇప్పుడు మానవులుగా జీవిస్తున్న మనం కూడా పూర్వజన్మలో ఎవరికో పితృదేవతలుగా ఉన్నవాళ్లమే! ఆయా వంశజులు చేసిన, చేస్తున్న పితృకార్య ఫలాలు మన పిల్లలకు అయాచితంగా లభించే అదృష్టాలుగా పరిణమిస్తాయి. ఈ ఫలితాలను విశ్వేదేవతలు మనకు అందిస్తున్నారు. శ్రాద్ధతిథి రోజు విశ్వేదేవత స్థానం నిమిత్తం ఒక భోక్తను నియమిస్తారు. నిజానికి ఇద్దరిని నియమించాలి. పురూరవ, ఆర్ద్ర అనే పేర్లున్న ఇద్దరు విశ్వేదేవతలు ఆ భోక్తలోకి ప్రవేశించి ఆనాటి కర్మ ఫలాలను పితృలోకాలకు కొనిపోయి వారికి అందిస్తారు. అక్కడలేని పితృదేవతలు ఏయే లోకాలలో, ఏయే జన్మల్లో ఉన్నారో చూసుకొని వారికి అనుకూలమైన పద్ధతిలో ఆయా ఫలాలను అందజేస్తారు.
అయినవారందరికీ
తద్దినంలో మూడు తరాల పితృ లేదా మాతృస్థానాలు మాత్రమే ప్రస్తావనకు వస్తాయి. మహాలయ పక్ష శ్రాద్ధంలో ప్రపితామహుడితోపాటు పితామహుడి వంశం మొత్తం ప్రస్తావనకు వస్తుంది. మాతామహుని వంశం మొత్తాన్ని స్మరించుకుంటాం. అత్తమామల ప్రస్తావన వస్తుంది. గురువులు, మిత్రులు, బంధువులు, సేవకులు, అనాథ ప్రేతములుగా మిగిలిపోయిన పూర్వజులకు సైతం పిండ ప్రదానం చేస్తాం. మహాలయ శ్రాద్ధానికి లోచీమనీ, ధూర్వి అని పేర్లున్న ఇద్దరు విశ్వేదేవతలు వచ్చి కర్త శ్రద్ధాభక్తులను గమనించి సంతోషిస్తారు.
కొడుకు లేకపోతే మనవడు
స్త్రీ సంతానం మాత్రమే ఉన్నవారి విషయంలో శ్రాద్ధకర్మను నిర్వహించే అధికారం దౌహిత్రునిది (మనవడిది). అల్లుడు జీవించి ఉండగా అతని కొడుకు కర్మ చేయడానికి వీలు లేదు కాబట్టి అల్లుడే అత్తమామల అంత్యేష్టిని, పితృకార్యాలను నిర్వహించాలి. అతని తర్వాత ఆ బాధ్యతను మనవడు స్వీకరిస్తాడు. ఈ శ్రాద్ధకర్మను ఎవరు నిర్వహించినా, అది వసురూపం వరకే పరిమితం. ఈ కారణంగానే ప్రాచీనులు పుత్రులను కోరుకున్నారు. అంతేగానీ, కుమార్తె పట్ల వైషమ్యంతో కాదు. పితృపక్షాలలో పెట్టే శ్రాద్ధాలలో కేవలం స్త్రీ సంతానం కలిగి ఉండి పరమపదించిన వారికి ఆకలిదప్పులు తీరుతాయి. ఊర్ధలోకప్రాప్తి కలుగుతుంది.
– వరిగొండ కాంతారావు
94418 86824