మూత్రపిండాలు దెబ్బతిన్న ప్రతి రోగికీ డయాలసిస్ అవసరం కాకపోవచ్చు. కానీ, ఒక్కసారి డయాలసిస్ తప్పదని వైద్యులు నిర్ధారిస్తే.. చేయించుకోవాల్సిందే. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కూడా. ఇందులోనూ ఆధునిక పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా, పెరిటోనియల్ డయాలసిస్
కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు ఎంతో ఊరటనిస్తున్నది. దవాఖానా చుట్టూ తిరగాల్సిన పన్లేదు. గంటలకు గంటలు వృథా చేసుకోవాల్సిన అవసరం లేదు. దుష్ఫలితాలూ ఉండవు.
దీర్ఘకాలిక రుగ్మతలలో మూత్రపిండ వ్యాధి ఒకటి. ఈ మధ్యకాలంలో కిడ్నీ రోగుల సంఖ్య పెరిగిపోతున్నది. సమాంతరంగా డయాలసిస్ రోగుల సంఖ్య కూడా అధికం అవుతున్నది. దేశంలో 12 నుంచి 17 శాతం మంది శాశ్వత కిడ్నీ రోగులు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. తొలిదశలో రుగ్మత లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్లనే మూత్రపిండాలు శాశ్వతంగా విఫలం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మూత్రపిండాలు విఫలమైన 90 శాతం రోగుల్లో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అందుకే, కిడ్నీ
ఫెయిల్యూర్ సమస్యను ‘సైలెంట్ కిల్లర్’గా అభివర్ణిస్తారు. మూత్రపిండ వైఫల్యానికి ప్రధాన కారణం మధుమేహమే. వందమంది శాశ్వత కిడ్నీ ఫెయిల్యూర్ రోగుల్లో యాభై మందికి కేవలం షుగర్ వల్లనే విఫలం అవుతున్నట్టు తెలుస్తున్నది. మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతింటే డయాలసిస్ తప్పదు. సాధారణంగా హీమోడయాలసిస్ (హెచ్డీ) పద్ధతిలో దీన్ని నిర్వహిస్తారు. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారానికి రెండు మూడుసార్లు డయాలసిస్కు వెళ్లాల్సి ఉంటుంది. ఇదో ఖరీదైన వ్యవహారం. చాలా సమయం కేటాయించాలి. ఒకటిరెండు దుష్ప్రభావాలూ ఉంటాయి. అలా అని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. దీనికి ప్రత్యామ్నాయమే.. పెరిటోనియల్ డయాలసిస్(పీడీ). ఈ పద్ధతి అన్నివిధాలా సత్ఫలితాలను ఇస్తున్నది.
మూత్రపిండాలు విఫలమైతే..
మూత్రపిండాల పనితీరు మందగించిన ప్రతి రోగికీ డయాలసిస్ అవసరం కాకపోవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ అనేది రెండు రకాలు. ఒకటి.. తాత్కాలిక వైఫల్యం. ఈ దశలో మూత్రపిండ వైఫల్యం అకస్మాత్తుగా ఏర్పడుతుంది. ఒకటి రెండు నెలల్లో సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. పరిస్థితిని బట్టి నెల నుంచి రెండు నెలల కాలం వైద్యం తీసుకుంటే సరిపోతుంది. రెండోది.. శాశ్వత వైఫల్యం. దీన్నే పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. అంటే, అప్పటికే మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతిని ఉంటాయి. మళ్లీ పనిచేయించడం అసాధ్యమైన పరిస్థితి. మూత్రపిండాలు తాత్కాలికంగా విఫలమైనా, శాశ్వతంగా విఫలమైనా మొదట ఔషధాలతోనే చికిత్స ప్రారంభిస్తారు.
ప్రధాన లక్షణాలు
కాళ్ల వాపు, ముఖం వాపు.
అకారణంగా శ్వాస సమస్యలు.
ఎడతెరిపిలేని వాంతులు.
మూత్ర విసర్జన తగ్గిపోవడం.
డయాలసిస్ సంకేతాలు..
శరీరంలో వ్యర్థ జలాలు బాగా పెరిగిపోయి, ఊపిరితిత్తులలో నీరు చేరినప్పుడు డయాలసిస్ అవసరం అవుతుంది. మందులకు కూడా అదుపులోకి రానంత స్థాయిలో.. రక్తంలో సీరం పొటాషియం, ఆమ్లాలు పేరుకుపోయినప్పుడు, రక్తంలో తిష్ఠవేసిన సీరం క్రియాటిన్ శరీరంలోని ఇతర భాగాల మీద చెడు ప్రభావం చూపినప్పుడు, రక్తంలో విషపూరిత పదార్థాలు చేరిపోయి ఆకలి పూర్తిగా తగ్గిపోయినప్పుడు.. దాన్ని డయాలసిస్కు సంకేతంగా భావించాల్సి ఉంటుంది. ఇక, హీమోడయాలసిస్ (హెచ్డీ), పెరిటోనియల్ డయాలసిస్(పీడీ).. రెండిటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిందే. రెండు వ్యవస్థల పనితీరుపై అవ గాహన ఉంటేనే సరైన నిర్ణయం తీసుకోగలం.
హీమోడయాలసిస్ (హెచ్డీ)
హీమోడయాలసిస్లో యంత్రం సాయంతో రక్త శుద్ధి చేస్తారు. రోగి రక్తనాళాల్లోకి ఒక సన్నటి పైప్ (క్యాథటర్) అమర్చడం ద్వారా లేదా ఎ.వి.ఫిస్టులా అనే మైనర్ సర్జరీతో రక్తాన్ని డయాలసిస్ యంత్రానికి పంప్ చేస్తారు. హెచ్డీ డయాలసిస్ చేయించుకోవాలంటే వారంలో రెండుమూడు సార్లు దవాఖానాకు వెళ్లాల్సి ఉంటుంది.
పెరిటోనియల్ డయాలసిస్ (పీడీ)
పెరిటోనియల్ డయాలసిస్లో రోగి డయాలసిస్ కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే సొంతంగా చేసుకోవచ్చు. దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు రైళ్లు, బస్సులు, విమానాల్లో కూడా చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ పద్ధతిలో రక్తం సహజ పద్ధతిలో శుద్ధి అవుతుంది. రోగి కడుపులో బొడ్డు కింద ‘స్వాన్ నెక్ క్యాథటర్’ అనే ట్యూబ్ను అమర్చుతారు. ఈ గొట్టాన్ని పెరిటోనియల్ బ్యాగ్స్కు అమరుస్తారు. ఇందులో రెండు సంచులు ఉంటాయి. ఒక బ్యాగులో రెండు లీటర్ల పెరిటోనియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. మరో బ్యాగు ఖాళీగా ఉంటుంది. ఈ వ్యవస్థను రోగి కడుపులోని ట్యూబ్కు అనుసంధానం చేసినప్పుడు కడుపులోని నీరంతా ఖాళీ సంచిలోకి వచ్చేస్తుంది. ఫ్లూయిడ్తో నిండిన బ్యాగులోని నీరు నేరుగా కడుపులోకి చేరుతుంది. ఈప్రక్రియలో కడుపులోని ‘పెరిటోనియల్ పొరలు’ జల్లెడలా పనిచేస్తూ రక్తాన్ని శుద్ధి చేస్తాయి. దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవు. రోజూ మూడుసార్లు .. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పీడీ చేయాల్సి ఉంటుంది. పెరిటోనియల్ డయాలసిస్ పద్ధతిలో నీటిని ఎంతసేపు కడుపులోకి పంపాలి, కడుపులోంచి ఎంత వ్యవధి తర్వాత బయటికి తీయాలనేది.. వైద్యుల సూచన మేరకు రోగి స్వయంగా పరికరంలో సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ‘సైక్లర్’ అమర్చుకుంటే దానంతట అదే కడుపులోని నీటిని ఖాళీ బ్యాగులోకి పంపుతుంది. ఫ్లూయిడ్ బ్యాగులోని నీటిని లోపలికి చేరవేస్తుంది. పెరిటోనియల్ డయాలసిస్ వల్ల సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. హెచ్డీ డయాలసిస్ కోసం వారంలో మూడుసార్లు దవాఖానాకు వెళ్లాల్సి వస్తుంది. ప్రతి డయాలసిస్కు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. అదే పీడీలో దవాఖానాతో పన్లేదు. డయాలసిస్ కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాల్సిన అవసరమూ రాదు. నడుము బెల్టు వద్ద బ్యాగ్స్అమర్చుకుంటే దాని పని అదే చేసుకుపోతుంది. మన పని మనం చేసుకోవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వ్యాధి నిర్ధారణ జరిగినప్పటి నుంచీ డయాబెటిక్ రోగులు చక్కెర స్థాయులు నియంత్రణలో ఉండేలా జాగ్రత్తపడాలి.
రక్తపోటును అదుపులో పెట్టుకోవాలి.
వైద్యులను సంప్రదించకుండా పెయిన్ కిల్లర్స్ వాడకూడదు.
కనీసం వారంలో ఐదు రోజులు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.
40 ఏండ్లు దాటిన వారు కనీసం సంవత్సరానికి ఒకసారి రక్తపోటు, మధుమేహ స్థాయులు పరీక్షించుకోవాలి. శరీరంలో ఏ చిన్న మార్పు కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు.
డాక్టర్ శ్రీభూషణ్ రాజు
యూరాలజీ విభాగ అధిపతి
నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్), హైదరాబాద్
-మహేశ్వర్రావు బండారి