అన్నదాత జానపదానికి ఆద్యుడు. తన కష్టాన్ని, సంతోషాన్ని పాటలుగా కైగట్టిండు. శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో.. సంగీత, సాహిత్య ప్రక్రియలూ రూపాన్ని మార్చుకుంటున్న ఈ కాలంలో..పొలం గట్ల వెంట ఇంకా జాన పదం ఆడి పాడిస్తూనే ఉన్నది. రైతు ఉన్నంత వరకూ జానపదం ఉంటుందని చెబుతున్న వనీల గుజ్జేటి పాటల ముచ్చట..
లోకంతో సంబంధం లేనట్టు దూరాన ఏదో మారుమూలన ఉండేది మా ఊరు. పంట పొలాలూ, చెట్లూ చేమలతో మనసుకు ఉల్లాసాన్నిచ్చే వాతావరణం కనిపించేది. చిన్నప్పుడు ఆటపాటలే మా ప్రపంచం. కోయిల ‘కూ’ అంటే ‘కుహూ కుహూ’ అని గొంతు కలిపేటోళ్లం. మంచిర్యాల జిల్లా మందమర్రి దగ్గర చిర్రకుంట అనే మారుమూల పల్లె మాది. మాకు కొంత పొలం ఉండేది. నేనూ పొలానికి పోయేదాన్ని. నాయిన నాగలి కట్టినప్పుడు అన్నం తీస్కపోయేదాన్ని. అమ్మ అలుకు చేసినప్పుడు తోడుగా వెళ్లేదాన్ని. పని చేసుకుంటూ మా అమ్మ తీరొక్క పాటలు పాడుతుండె. నాయిన కూడా జాన పదాలు ఎత్తుకునేటోడు. ఇవన్నీ విన్నంక నా మనసు ఊరికెందుకుంటది? ఇద్దరు ముగ్గురు పిల్లల్ని జత చేసుకొని రకరకాల పాటలు పాడి వినిపించేదాన్ని. మా అమ్మానాయిన సంబురపడుతుండె నా పాటతో.
పాడతా అని చెప్పిన
నేను నేర్చుకున్న జానపదాలన్నీ వ్యవసాయంతో ముడిపడినవే. పూత గురించి, కాత గురించి, పైరు గురించి, ఎద్దు గురించి, నీటి గురించి పాడుకోవడం అలవాటైంది. ఒకసారి భజన కార్యక్రమం పెట్టిండ్రు. నేనూ వెళ్లిన. అది నాకు టర్నింగ్ పాయింట్ లెక్క. ఓహో.. ఇసొంటి పాటలు కూడా ఉంటయా అని అర్థమైంది. భక్తి, సామాజిక పాటల గురించి వెతుకులాట మొదలువెట్టిన. మల్లొకసారి భజన పెట్టిండ్రు. మా అన్నవాళ్లు ‘ఇయ్యాల నువ్వు పాట పాడాల్సిందేరా’ అని నన్ను తీస్కపోయిండ్రు. ఒకరిద్దరు పాడంగనే ‘నేను పాడతా’ అనిపించిండ్రు నాతో. అందరూ నన్ను విచిత్రంగా చూసిండ్రు. ‘ఏం పాటలొచ్చు నీకు?’ అన్నరు. ‘అన్ని వస్తయి. భజన పాటలు కూడా పాడతా’ అని చెప్పి ఒక పాట వినిపించిన. శభాష్ అన్నరు.
అనుభవం నేర్పింది
నా పాట తీరు నచ్చడంతో స్టేజి ప్రోగ్రామ్లు, భజన కార్యక్రమాలకు తీసుకెళ్లేవాళ్లు. అట్లా పాటలతో ప్రయాణం చేస్తూనే డిగ్రీ పాసైన. తర్వాత పెండ్లి అయ్యింది. నా పాట ఇంట్ల నాలుగ్గోడలకే పరిమితమైంది. పిల్లలు చిన్నోళ్లు కావడంతో ఎలాంటి సాహసం చేయలేకపోయిన. ‘ఒకవైపు యూట్యూబ్లో రకరకాల పాటలొస్తున్నయి. నా లెక్క పాటే ప్రాణం అనుకున్నవాళ్లకు యూట్యూబ్ నిజంగా ఒక వరం లాంటిది. కానీ నేను దానిని చేరుకో గలనా?’ అనిపించింది. ఆర్థిక పరిస్థితులు కూడా వేధించినయి. చేతిలో ఇరవై రూపాయలు కూడా లేని పరిస్థితి. ఆ బాధల్లోంచీ పాటలు పుట్టుకొచ్చినయి. జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను కైగట్టి పాడటమే జానపదమని అప్పుడు అర్థమైంది.
తొమ్మిదేండ్ల నిరీక్షణ
చిన్నప్పటి నుంచి సేకరించిన రకరకాల పాటలను డైరీలో రాసుకున్న. ‘ఎప్పుడైనా పరిస్థితి బాగు పడకపోవునా? నాకూ అవకాశం దక్కకపోవునా? అన్న ఆశ. పాటలనూ పిల్లలతో సమానంగా చూసుకున్న. ఆ సమయంలో నా భర్త ధైర్యాన్నిచ్చిండు. జానపదం పాడితే మన బాల్యం యాదికొస్తది. పల్లె యాదికొస్తది. ప్రకృతి యాదికొస్తది. మట్టిలో కలిసిన మనవాళ్లు యాదికొస్తరు’ అనుకుంటూ అడుగు ముందుకేసిన. ఓసారి ‘ఎంవీ మ్యూజిక్’ మల్లిక్ తేజన్నను కలిసిన. నా పాటలు వినిపిస్తే మస్తు సంబురపడ్డడు. ‘కొద్దిగా మార్పులు చేస్తే ఇంతకన్నా అందమైన పల్లె పాటలు ఉండవ్’ అని మెచ్చుకున్నడు. తొలి అవకాశంగా ‘లేత లేత సొప్పల్లు ల్యాగల్లు మేసె.. ల్యాగల్లు మేసే నా నెమలీయ రాజా’ పాటకు అవకాశమిచ్చిండు. ఇది వ్యవసాయాన్ని భుజాల మీదేసుకొని కష్టపడే ఎద్దుల గురించి పాడే పాట. సూపర్ హిట్టయ్యింది. మంచి పేరు, గుర్తింపు వచ్చినయి. ఇప్పుడు చాలా అవకాశాలు వస్తున్నయి. ‘సజ్జెల్లు సామల్లూ ఏటివరి గజ్జెల్లు.. సామలే రామందునా’, ‘దుక్కిదున్నిన మిరియమా.. దున్నలేదా మిరియమా’, ‘సుక్రవారం సక్కన్నిదినమా ఉత్తరాజా పొయ్యి ఇత్తునం తెచ్చి’, ‘పొద్దువోసె గట్ల నడుమ బొద్దికూర ఏరబోతే’, ‘కుమ్మరి చేసిన గుండు కుందెన్లూ..’ వంటి పాటలకు దృశ్యరూపం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న. ఇన్నికష్టాలు పడ్డ నా పాట.. సినిమానూ చేరితే ధన్యమవుతుందని అనుకుంటున్న.
– దాయి శ్రీశైలం