మన జీవిత ప్రయాణంలో మనం ఎన్నో విజయాలను సాధిస్తుంటాం. ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తుంటాం. కానీ, ఈ విజయాలు మన కళ్ల ముందు ఒక అదృశ్య గోడను నిర్మిస్తాయని మనకు తెలియదు. అదే ‘అహంకారం’. ఇదే మనలోని నిజమైన వ్యక్తిత్వాన్ని, దైవత్వాన్ని దాచిపెట్టే ఒక మందపాటి తెర.
ఒక వ్యక్తికి నీతిగా బతకమని లేదా దైవచింతనతో ఉండమని చెప్పినప్పుడు, వారిలో ఒక రకమైన అశాంతి మొదలవుతుంది. ఆ క్షణంలోనే వారిలోని ‘అహం’ మేల్కొంటుంది. ఇది కేవలం గర్వం మాత్రమే కాదు, ఒక రకమైన ఆత్మవంచన. తనలోని తప్పులను ఒప్పుకోలేక, పదిమంది ముందు గొప్పగా కనిపించాలనే తాపత్రయంలో మనిషి అబద్ధపు ముసుగును వేసుకుంటాడు. కానీ, సత్యాన్ని మరుగున పడేసి ఎన్ని అబద్ధపు ముసుగులు వేసుకున్నా, చివరికి అది మనశ్శాంతిని దూరం చేస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు హెచ్చరిస్తున్నాయి.
సాతాను కథను మనం ఒక ఉదాహరణగా తీసుకుంటే, గర్వం మనిషిని ఎంతటి అధోగతికి తీసుకువెళ్తుందో అర్థమవుతుంది. తన తప్పును ఒప్పుకోవడానికి బదులు, ఇతరులను నిందించే ప్రయత్నం చేయడం వల్ల అతను శాశ్వత అవమానాన్ని మూటగట్టుకున్నాడు. మన జీవితాల్లో కూడా, ఎవరైనా మన తప్పును ఎత్తిచూపినప్పుడు, మౌనంగా ఆత్మపరిశీలన చేసుకోవడం మానేసి, ఎదురుదాడి చేయడమే మనం చేస్తున్న పెద్ద పొరపాటు. వినయంగా ఉండటం అంటే బలహీనంగా ఉండటం అని కాదు. ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వ్యక్తికి కావాల్సిన అతిపెద్ద శక్తి ‘వినయం’.
ఇది మనిషిని మృదువుగా మారుస్తుంది. అదే సమయంలో, సమాజంలో అన్యాయం జరిగినప్పుడు లేదా ధర్మం దెబ్బతిన్నప్పుడు, ఒక విశ్వాసి రాతిలా దృఢంగా నిలబడాలి. అంటే, మనుషుల పట్ల వినయం, సూత్రాల పట్ల కఠినత్వం.. ఇదే నిజమైన ఆధ్యాత్మిక పరిణతి. మనం ఈ ప్రపంచంలోకి ఖాళీ చేతులతో వచ్చాం, వెళ్లేటప్పుడు కూడా అలాగే వెళ్తాం. మనిషికున్న ఏకైక నిజమైన ఆభరణం ‘వినయం’. మన కళ్ల ముందు ఉన్న అహంకారపు తెరను తొలగించుకున్నప్పుడే, జీవితం అంటే కేవలం పోరాటం కాదని, అదొక సుందరమైన సమర్పణ అని అర్థమవుతుంది. కాబట్టి, మన గర్వాన్ని వదిలేసి, ప్రశాంతమైన, అర్థవంతమైన జీవనం వైపు అడుగులు వేద్దాం.
-ముహమ్మద్ ముజాహిద్ ,96406 22076