ఎనిమిదేండ్లకే పదో తరగతి పాస్. కానీ, బడి ఎలా ఉంటుందో తెలియదు. పదేండ్లకే ఇంటర్ కాలేజ్ టాపర్. కానీ, క్యాంపస్ వాతావరణాన్ని చూడలేదు. యూనివర్సిటీకి వెళ్లకుండానే ఎంఏ, ఎల్ఎల్బీ, పీహెచ్డీ పూర్తి. కానీ ప్రపంచాన్ని అధ్యయనం చేయడం ఆపలేదు. బాల్యం నుంచీ ప్రోగ్రెస్కార్డు మొహం చూడకపోయినా.. తన జీవితంలోని ప్రతి ప్రోగ్రెస్ను ప్రపంచం ముందుపెట్టింది నైనా జైస్వాల్. బాల మేధావిగా, మోటివేషనల్ స్పీకర్గా, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా.. ఆమె ప్రయాణం ఆసక్తికరం, ఆశ్చర్యకరం. అమ్మ భాగ్య లక్ష్మి, నాన్న అశ్విన్ జైస్వాల్, తమ్ముడు అగస్త్య, తను.. నైనా ఇల్లే ఓ ఓపెన్ స్కూల్. ఆ ముచ్చటైన కుటుంబంతో మాటలు కలుపుదాం..
తల్లీకూతుళ్లు ఒకేసారి ఎల్ఎల్బీ చదివి, ఫస్ట్క్లాస్లో పాసయ్యారు. నైనా కోసమే ఎల్ఎల్బీ చేశారని విన్నాం నిజమేనా?
భాగ్యలక్ష్మి : (నవ్వుతూ) అవును. నేను నైనా కోసమే ఎల్ఎల్బీ చేశాను. గతంలో ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ చేశాను. నైనా ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన తర్వాత.. కొన్నాళ్లు ఖాళీగా ఉంది. ఈ క్రమంలో సివిల్స్కు ప్రిపేర్ అవుతుండగా.. ఎల్ఎల్బీ చదివితే ఉపయోగం ఉంటుందని తెలుసుకుంది. నేను కూడా ఇంట్లో ఖాళీగానే ఉండటంతో ఇద్దరం ఒకేసారి ఎల్ఎల్బీకి దరఖాస్తు చేశాం. ఫస్ట్క్లాస్లో పాసయ్యాం.
తల్లి, న్యూట్రిషనిస్టు, ఆర్టిస్ట్, ఫిట్నెస్ ఔత్సాహికురాలిగా మీ ప్రయాణం ఎలా ఉంది?
భాగ్యలక్ష్మి : చిన్నప్పటి నుంచీ పిల్లల చదువు బాధ్యత మావారిదే. నా వంతుగా వాళ్లకు పోషకాహారం ఇవ్వాలనే ఉద్దేశంతో న్యూట్రిషనిస్ట్గా అవతరించాను. పిల్లలకు జంక్ఫుడ్ అనే మాటే తెలియకుండా పెంచాను. వాళ్లకోసం ప్రత్యేకంగా డ్రైఫ్రూట్స్, ప్రొటీన్ ఫుడ్ చేసేదాన్ని. డ్రైఫ్రూట్స్ను చాక్లెట్లా చేసి, అదే చాక్లెట్ అని తినిపించే దాన్ని. వాళ్లూ అలాగే అలవాటయ్యారు. పిల్లల్లో ఆరోగ్య స్పృహ పెంచడానికి వాళ్లతో పోటీపడి వ్యాయామం చేసేదాన్ని. మా నాన్న మంచి ఆర్టిస్ట్. నేను కూడా పెయింటింగ్స్ వేస్తుంటా.
ఇవన్నీ చేయడానికి మీకు సమయం సరిపోతుందా? టైమ్ మేనేజ్మెంట్ గురించి చెప్పండి?
భాగ్యలక్ష్మి : చాలా సింపుల్. చాలామంది తల్లిదండ్రులు ఫంక్షన్లు, శుభకార్యాలు, ఉద్యోగాలంటూ కాలం గడిపేస్తుంటారు. రాత్రి కాగానే సినిమా, సీరియల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. మాకు అలాంటి బాధలేవీ లేవు. ఇంట్లో నాలుగైదు టీవీలు ఉన్నా.. ఒక్కదానికీ కేబుల్ కనెక్షన్ లేదు (నవ్వుతూ..). వాటిని కంప్యూటర్కు అనుసంధానం చేసి పిల్లల చదువు కోసం ఉపయోగిస్తాం. నేనూ వాళ్లతోపాటు చదువుకుంటాను. అందరం కలిసే తింటాం, కలిసే ఉంటాం. నా వరకు పిల్లలే ప్రపంచం.
కేబుల్ కనెక్షన్ కూడా లేదు.. మరి వినోదం ?
భాగ్యలక్ష్మి : (బిగ్గరగా నవ్వుతూ..) ఓ.. దానికేం తక్కువ లేదు. మాది సంగీత కుటుంబం. పిల్లలకు వాద్య సంగీతంలో ప్రవేశం ఉంది. పాటలు పాడతారు. దేశ, విదేశాల్లో జరిగే టేబుల్ టెన్నిస్ టోర్నీలకు నైనాతో పాటు మేమూ వెళ్తాం. ఆ తర్వాత ఓ వారంపాటు చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలకు వెళ్తాం. అక్కడి ఆహారం, పరిసరాలు ఆస్వాదిస్తాం. మాకు ఆహ్లాదం, ఆనందం విషయంలో ఎలాంటి లోటూ లేదు.
మీది వరంగల్. అశ్విన్ది యూపీ. జోడీ ఎలా కుదిరింది?
భాగ్యలక్ష్మి : నాన్నవాళ్లు చిన్న బిజినెస్లు చేసేవారు. ఈ క్రమంలోనే అశ్విన్తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి, వివాహం వరకూ వచ్చింది. వాళ్ల పూర్వికుల స్వస్థలం ఉత్తరప్రదేశ్. నిజాం ప్రభువుల సూచనమేరకు జైస్వాల్ కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. అశ్విన్ వాళ్ల తాతయ్య, నాన్న హైదరాబాద్ వాళ్లే. జూనియర్ జడ్జి పరీక్షలు రాయాలనే ఆలోచన ఉంది.
టీచర్ ఉద్యోగాన్ని వదిలేసుకొని, ఇష్టమైన రెజ్లింగ్ను కాదనుకొని, పిల్లల కోసమే ఎల్ఎల్బీ, జర్నలిజం చెయ్యడం, స్పోర్ట్స్ కోచ్గా మారడం ఎందుకు?
అశ్విన్ జైస్వాల్ : అప్పట్లో ఆడపిల్లలు పుడితే చాలామంది బాధపడేవారు. మా ఇంట్లో కూడా ఆడపిల్ల పుట్టిందనగానే ‘నలుగురిలో తల వంచుకుని బతకాలి. కట్నం కోసం డబ్బు సిద్ధం చేసుకో. బయట తిప్పకండి. అణగిమణగి ఉండటం అలవాటు చేయండి’ అంటూ ఉచిత సలహాలు ఇచ్చారు. అయితే, మా బిడ్డను మాత్రం వంటింట్లో కుందేలులా కాకుండా, అడవిలో సివంగిలా పెంచాలని నిర్ణయించుకున్నాను. మా ‘హోం స్కూలింగ్’ ప్రయోగం ఫలించింది. మా కష్టానికి తగ్గట్లుగా నైనా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. తను సాధించాల్సింది ఇంకా చాలా ఉంది.
నైనా! అమ్మతో కలిసి కాలేజ్ను ఎలా ఎంజాయ్ చేశారు?
నైనా జైస్వాల్ : అమ్మ నాతో చాలా స్నేహంగా ఉంటుంది. సివిల్స్కు ప్రిపేర్ అయ్యేవారికి ఎల్ఎల్బీ ఉపకరిస్తుందని, చట్టాల గురించి తెలుస్తుందని నన్ను బాగా ప్రోత్సహించారు. ‘నేను చేస్తాను. నువ్వూ వస్తే నాతోపాటు రావొచ్చు’ అని అమ్మ చెప్పగానే నేను క్షణం ఆలోచించకుండా ఓకే చెప్పాను. అలా మొదటిసారి అమ్మా, నేను కలిసి కాలేజ్కు వెళ్లాం. ఇద్దరం కలిసి ప్రాక్టికల్స్కు చదువుకునే వాళ్లం. మా ఇద్దరినీ చూసి స్టూడెంట్స్ ఆశ్యర్చపోయే వాళ్లు.
టేబుల్ టెన్నిస్ నేర్చుకోవాలని ఎందుకు అనుకున్నారు? ఆ ఆటే ఎందుకు నేర్పించారు?
నైనా జైస్వాల్ : ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆటల్లో టేబుల్ టెన్నిస్ ఒకటి. రెప్పపాటు సమయంలో వ్యూహాలు మార్చుకోవాలి, షాట్స్ ఆడాలి. ఆటవల్ల ఆలోచనల్లో వేగం పెరిగింది. నేను రెండు చేతులతో ఒకేసారి రాయగలను. కేవలం రెండు సెకన్లలో కీబోర్డులో ‘ఏ టు జెడ్’ టైప్ చేయగలిగాను. ఐక్యూ లెవల్ చాలా పెరుగుతుంది కూడా.
సివిల్ సర్వీసెస్ జపం చేస్తున్నారు. సామాజిక లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా?
నైనా జైస్వాల్ : మారుమూల గ్రామాల్లో మహిళల సాధికారత కోసం పనిచెయ్యాలని ఉంది. ఆడవాళ్ల రక్షణ కోసం మరిన్ని చట్టాలు తీసుకురావాలి. అన్ని రంగాల్లోనూ వారికి అవకాశం కల్పించాలి. ఆ లక్ష్యంతోనే నేను సివిల్స్ రాద్దామని అనుకుంటున్నా. అది ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా నాకు సంతోషమే. మరో లక్ష్యం దేశానికి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ అందించడం.
మహిళా సాధికారతపైనే పీహెచ్డీ చేస్తున్నారని తెలిసింది? మీ క్షేత్రస్థాయి పరిశోధనలో ఏం గమనించారు?
నైనా జైస్వాల్ : ఆసియాలో అతిచిన్న వయసులోనే పీజీ చేసిన యువతిగా నా పేరిట రికార్డు ఉంది. రాజమండ్రిలో ఆదికవి నన్నయ
యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేస్తున్నా. లోతైన అధ్యయనం కోసం తెలంగాణ మారుమూల గ్రామాల్లో తిరుగుతున్నాను. మహిళలకు అసమాన ప్రతిభ ఉంది. ప్రోత్సాహం ఇచ్చి, వసతులు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. చదువు, స్పోర్ట్స్కు వసతులుంటే బాగుంటుంది.
ఒకవైపు దేశానికి ఒలింపిక్స్ మెడల్ అందించాలని అనుకుంటున్నారు.. మరోవైపు సివిల్స్? ఎలా బ్యాలెన్స్ చేస్తారు?
నైనా జైస్వాల్ : నా ప్రస్తుత టార్గెట్ స్పోర్ట్స్. ఏదైనా పెద్దవేదిక మీద దేశానికి గోల్డ్ మెడల్ అందించడానికి ఇదే సరైన సమయం. సివిల్స్కు ఇంకా వయసు ఉంది. స్పోర్ట్స్ లేనప్పుడు చదువుకుంటా. అండర్ -19 వరకూ ఇండియాలో టాప్-6లో ఉన్నా. టోర్నీలు ఉంటే 70 శాతం టైమ్ ఆటకు, 30 శాతం చదువులకు. టోర్నీలు లేకపోతే 70 శాతం చదువులకు.. 30 శాతం ఆటకు కేటాయిస్తా. ఒలింపిక్స్లో ఇండియాకు గోల్డ్ మెడల్ అందించాల్సిందే.
మీ జీవితం ప్రతి మలుపులో అమ్మానాన్న ఉన్నారు. వారి త్యాగాలకు మీరిచ్చే కానుక?
నైనా : వాళ్లు మా కోసం ఎంత త్యాగం చేస్తున్నారో తెలుసు. అందుకే ఆ కష్టాన్ని వృథా చెయ్యకుండా నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తాను. తమ్ముడు కూడా ఎంబీబీఎస్ చేస్తున్నాడు. ఎంబీబీఎస్ పరీక్ష రాసిన అతి పిన్న వయస్కుడిగా ఈ మధ్యే రికార్డు సాధించాడు. తనూ టేబుల్ టెన్నిస్ ఆడతాడు, పాడతాడు. ఇలాంటి తల్లిదండ్రులు దొరకడం మా అదృష్టం.
నైనా నుంచి స్పోర్ట్స్ అకాడమీ ఆశించవచ్చా?
నైనా : ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదన ఏదీలేదు. నా లక్ష్యాలు నెరవేరిన తర్వాత కచ్చితంగా ఆలోచిస్తా. ప్రస్తుతం ఒక కోచ్గా నాన్న నాకు ఎలాంటి శిక్షణ ఇచ్చారో.. అలాంటి శిక్షణే నేనూ కొంతమంది పిల్లలకు ఇస్తున్నా. దాదాపు 50 మందికి ఇంట్లోనే హోమ్ స్కూలింగ్ నడుస్తున్నది. వాళ్లు కూడా నాలాగే రెండు చేతులతో రాయగలరు. వేగంగా చదవగలరు, ఆడగలరు.
మీ పిల్లలను చూసి గొప్పగా ఫీలైన సందర్భాలు?
అశ్విన్, భాగ్యలక్ష్మి : ఆటల విషయంలో కానీ, పాటల విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, మా పిల్లలను చూస్తే.. ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. అవసరమైతే వాళ్లే ఇంట్లో పనులన్నీ చేస్తారు. నైనా చాలా చక్కగా వంటచేస్తుంది. హైదరాబాదీ బిర్యానీని కేవలం 25 నిమిషాల్లో పూర్తి చేసి రికార్డుకెక్కింది. ఇంటికి పెద్దలు వచ్చినా తనే మర్యాదలు చేస్తుంది. వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడగలరు. దేన్నయినా ఎదుర్కోగలరు అనే నమ్మకం ఉంది. కన్నవారిగా మేం కోరుకునేదీ అదే.
మొదటిసారి కాలేజ్కు వెళ్లారు. ఎలా అనిపించింది?
నైనా : చిన్నతనం నుంచి తరగతి గదులు ఎలా ఉంటాయో తెలియదు. ఎల్ఎల్బీ కోసం ఒక్కోసారి కాలేజ్కు వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు కూడా అమ్మతో కలిసి వెళ్లేదాన్ని. ఆ అనుభూతి చాలా కొత్తగా అనిపించింది. కొందరు బట్టీపట్టి చదివితే.. మేము చదివి అర్థం చేసుకొని పరీక్షలు రాశాం. విద్యార్థులు మమ్మల్ని చూసి స్ఫూర్తి పొందేవారు. ‘మా తల్లిదండ్రులు కూడా మీలా ఎంకరేజ్ చేస్తే.. అద్భుతాలు సృష్టిస్తాం’ అనేవారు.
మీ ఇద్దరి మధ్యలో పోటీ ఎలా ఉంటుంది? కాలేజ్లో ఎలా ఉంది?
భాగ్యలక్ష్మి : మాకు ప్రతి విషయంలోనూ పోటీనే. ఇద్దరం చదువులో పోటీ పడతాం. ఫిట్నెస్లో పోటీ పడతాం. ఇంటి పనుల్లో పోటీ పడతాం. నైనా ఒకరోజు ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తే, నేను మరోరోజు. ఎల్ఎల్బీ కూడా పోటీపడి చదువుకున్నాం కాబట్టే, ఇద్దరమూ ఫస్ట్క్లాస్లో పాసయ్యాం.
– రవికుమార్ తోటపల్లి