ఒక రోజు, ఒక వ్యక్తి గౌతమ బుద్ధుడిని చూడటానికి వచ్చాడు. బుద్ధుడు ఏకాంతంగా ఒక చిన్న ఆవరణలో కూర్చుని ఉన్నాడు. వచ్చిన వ్యక్తి రెండు చేతుల నిండా పూలు ఉన్నాయి. తనను సమీపిస్తున్న ఆ వ్యక్తిని చూసి బుద్ధుడు, ‘పడేయి’ అన్నాడు. బహుశా ‘బుద్ధుడికి సమర్పణగా తీసుకొచ్చిన పూలను కింద పడేయమని అంటున్నాడేమో!’ అనుకున్నాడు. అంతలోనే ‘ఎడమ చేతిలో ఉన్న పూలను విడిచిపెట్టమంటున్నాడేమో’ అని సందేహించాడు. ఏదైనా ఎడమచేతితో ఇస్తే, దాన్ని అమంగళమైనదిగా భావిస్తారు. కాబట్టి అతను తన ఎడమ చేతిలోని పూలను పడేసి, వినయంగా ముందుకు సాగాడు. గౌతముడు అతని వైపు చూసి మరొకసారి ‘పడేయి’ అన్నాడు. అప్పుడు అతనికి ఏం చేయాలో తెలియలేదు, ఈ పూలతో వచ్చిన తప్పేంటి? అతను మిగిలిన పూలను కూడా పడేశాడు. అప్పుడు గౌతముడు, ‘నేను పడేయమన్నది పూలను కాదు. ఈ పూలను తెచ్చిన వాడు ఎవడైతే ఉన్నాడో అతడిని. లేదంటే మీరు బుద్ధుడిని తెలుసుకోలేరు. మీరు వస్తారు, నమస్కారం చేస్తారు, వింటారు, వెళతారు, కానీ మీరు ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తితో ఉండటం అంటే ఏంటో తెలుసుకోలేరు. మీరు ఈ అవకాశాన్ని పూర్తిగా కోల్పోతారు’ అన్నాడు బుద్ధుడు.
మీరు మీ జీవితంలోకి పూర్తిగా సరికొత్త పార్శ్వాన్ని తీసుకురావాలి అనుకుంటే, మీరు దాన్ని పడేయాలి, మరొక దాన్ని కాదు. మీ పనిని వదిలేయడం, మీ కుటుంబాన్ని వదిలి వెళ్లటం, లేదా దీన్ని, దాన్ని వదిలేయటం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం మీరు దేన్నయితే ‘నేను’ అని అంటున్నారో, అది కేవలం ఆలోచనల, భావోద్వేగాల, మనోభావాల, అభిప్రాయాల ఇంకా విశ్వాసాల సమాహారం మాత్రమే. మీరు దాన్ని పడేయకపోతే, ఇక కొత్త సంభావ్యతకు ఆస్కారం ఉండదు. కానీ, దానిని పడేద్దాం అనుకున్నంత మాత్రాన అది పడిపోదు. అందుకు అవలంబించ వలసిన విధానాలు, ప్రక్రియలు ఉన్నాయి.
-ప్రేమాశీస్సులతో సద్గురు ఈశా ఫౌండేషన్