బుల్లితెర ప్రకటనలు లేవు. వెండితెర బ్రాండింగ్ లేదు. మిరుమిట్లుగొలిపే ప్యాకేజింగ్ కనిపించదు. బహుళజాతి సంస్థల మార్కెట్ వ్యూహాలూ వినిపించవు. అయితేనేం, నిర్మల్ కేంద్రంగా.. ఆయుర్వేద మూలికలతో, ఆర్గానిక్ ముడిసరుకుతో తయారవుతున్న ‘గిరి’ సబ్బులు నాణ్యతకు భరోసా ఇస్తున్నాయి.
ఆ గిరిజన మహిళలు.. నిన్నమొన్నటి వరకూ సాధారణ కూలీలు. తెలంగాణ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ప్రోత్సాహం వాళ్ల జీవితాలను మార్చింది. ‘గిరి’ బ్రాండ్ సబ్బుల తయారీలో భాగస్వాములను చేసింది. ఆ ఆదాయంతో ఆర్థికంగా కూడా స్థిరపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 600 గిరిజన హాస్టళ్లు, గురుకులాలకు ‘గిరి’ సబ్బులే అందుతున్నాయి. పిల్లలు జోరుగా హుషారుగా జలకాలు ఆడుతున్నారు. ఇంకో ప్రత్యేకతా ఉంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకైక సబ్బుల ఫ్యాక్టరీ ఇది. ఈ ఉత్పత్తులను త్వరలోనే బహిరంగ మార్కెట్కు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సర్కారు చొరవతో..
గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్మల్లోని సోఫీనగర్లో సబ్బుల కార్ఖానాను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి నిత్యం పదివేల సబ్బులను తయారు చేసే సామర్థ్యం ఉంది. ఇరవైమంది గిరిజన మహిళలు పనిచేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన నిపుణులతో వీరికి శిక్షణ ఇప్పించారు. ప్రస్తుతం రోజుకు ఐదువేలకు పైగా సబ్బులు ఉత్పత్తి అవుతాయి. గిరాకీ ఎక్కువగా ఉన్న రోజుల్లో రెండు షిప్టులలో పనిచేస్తూ అధిక వేతనాలు పొందుతున్నారు స్థానిక మహిళలు. గిరిజన సహకార సంస్థ ఏటా రూ.3 కోట్ల వరకు
టర్నోవర్ సాధిస్తున్నది.
రసాయనాలు లేకుండా..
మార్కెట్ అనేది ఒక మాయాప్రపంచం. చాలా సందర్భాల్లో వినియోగదారులు ప్రకటనల మోజులో పడిపోతున్నారు. తళుకుబెళుకుల ప్యాకింగ్ చూసి మోసపోతున్నారు. కృతకమైన పరిమళాలకు మురిసిపోతున్నారు. నిజానికి ఆ సబ్బులతో చేసేది.. రసాయన స్నానం. నురగలుకక్కే కెమికల్స్ను కోరికోరి ఒంటికి పూసుకుంటాం. వివిధ పేర్లతో, వివిధ బ్రాండ్లలో దుకాణాల్ల్లో లభ్యమయ్యే సబ్బులలో దాదాపు 70 శాతం శరీరానికి హాని చేసేవేనని నిపుణుల అధ్యయనాలు చెబుతున్నాయి. మితిమీరిన రసాయన వినియోగం కొన్నిసార్లు చర్మ క్యాన్సర్కు కూడా దారి
తీయవచ్చు.
ఈ అనారోగ్యకర ధోరణిని అరి కట్టడానికే.. తెలంగాణ గిరిజన సహకార సంస ్థ(జీసీసీ) నిర్మల్ జిల్లా కేంద్రంగా ఔషధ గుణాలతో కూడిన సబ్బులను తయారు చేయిస్తున్నది. టోటల్ ఫ్యాటీ మ్యాటర్ (టీఎఫ్ఎం) శాతం ఎంత ఎక్కువ ఉంటే, ఆ సబ్బు అంత నాణ్యమైనదని అర్థం. కొన్నిరకాల సబ్బుల టీఎఫ్ఎం గ్రేడ్ బాగానే ఉన్నా.. ఆ సబ్బుల్లో ఆస్బెస్టాస్ వంటి రసాయన మిశ్రమాలు అధికంగా ఉంటాయి. వీటిని వాడితే చర్మానికి హాని తప్పదు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న సబ్బులలో టీఎఫ్ఎం 68 నుంచి 76 శాతం ఉంటున్నది. ‘గిరి’ సబ్బులలో అది 78 శాతం. వేప, తులసి, కలబందను ఉపయోగించి 150 గ్రాముల పరిమాణంలో సబ్బులను తయారు చేస్తున్నారిక్కడ. ప్రతిదశలో రాజీలేని నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నారు.
మారుతున్న జీవితాలు
‘ఇంతకు ముందు బీడీలు చుట్టేవాళ్లం. ఆ కూలీ డబ్బు బతికేందుకు కూడా సరిపోయేది కాదు. సబ్బుల కంపెనీలో చేరాక ఆదాయం పెరిగింది. నెలకు రూ.8,500 జీతం ఇస్తున్నారు’ అని సంతోషంగా చెబుతారు వెంకటాపూర్ గ్రామానికి చెందిన పుట్ట ప్రమీల. ‘బీడీలు చుట్టడం కంటే ఈ పనే బాగుంది. నాతోపాటు చాలా మంది ఉపాధి పొందుతున్నారు. మా సబ్బులు త్వరలోనే బహిరంగ మార్కెట్లోకి వస్తున్నట్టు తెలిసింది. చాలా సంతోషంగా ఉంది. అదే జరిగితే మాకు చేతినిండా పని’ అంటారు రజిత అనే కార్మికురాలు. గిరి ఉత్పత్తులు స్వచ్ఛతలో బంగారం. వాటికి మార్కెటింగ్ బలం తోడైతే బహుళజాతి కంపెనీలు దుకాణం కట్టేసుకోవాల్సిందే. ప్రస్తుత తరుణంలో ఇలాంటి సహజ ఉత్పత్తులే అవసరం.
త్వరలోనే.. బహిరంగ మార్కెట్లోకి
అటవీ ఉత్పత్తులను బహిరంగ మార్కెట్లలో విక్రయించడం ద్వారా గిరిజన సహకార సంస్థ ఆర్థికంగా బలోపేతం అవుతుంది. గిరిజనులకూ ఆదాయం సమకూరుతుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తేనెశుద్ధి కర్మాగారం ఇప్పటికే ఎంతోమందికి ఉపాధినిస్తున్నది. ఇక్కడ శుద్ధి చేసిన తేనె ‘గిరి’ బ్రాండ్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ అవుతున్నది. గిరి బ్రాండ్ శానిటైజర్కు మంచి గిరాకీ ఉంది. ఈ నేపథ్యంలో ‘గిరి’ సబ్బులను సైతం వినియోగదారులకు అందుబాటులో తెచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
…? గంజి ప్రదీప్ కుమార్