ఫర్టిలైజర్సిటీ, మార్చి 19: నకిలీ పాసు పుస్తకాల కేసులో తీగ లాగితే డొంక కదులుతున్నది. పోలీసుల విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. రామగుండం సీసీఎస్ పోలీసులు సూత్రధారితో పాటు 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సీపీ సత్యనారాయణ శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా రామగిరి, ముత్తారం మండలాలకు చెందిన 153 మంది రైతులు కల్వచర్ల తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 2016-18 సంవత్సరాల మధ్య రూ.కోటి 99 లక్షల 89 వేల రుణాలు తీసుకున్నారు. బ్యాంకు అధికారులు 2019 డిసెంబర్లో రుణాల రికవరీ చేసే సమయంలో సదరు రైతులకు నోటీసులు జారీ చేశారు. అయినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పాసు పుస్తకాలను తనిఖీ చేయగా నకిలీవిగా తేలడంతో రామగుండం సీసీఎస్లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు డీసీపీ (అడ్మిన్) అశోక్కుమార్ నేతృత్వంలోని సీసీఎస్ ఇన్స్పెక్టర్లు ఆరె వెంకటేశ్వర్లు, గట్ల మహేందర్రెడ్డి బృందం విచారణ చేపట్టింది. కేసులో సూత్రధారుడైన ముత్తారం మండలం మైదంబండకు చెందిన పందుల ప్రభాకర్ అలియాస్ ప్రవీణ్ను అదుపులోకి తీసుకున్నారు. అతడు 2016 నుంచి 19 వరకు టీజీబీ సెంటినరీకాలనీ బ్రాంచ్ మేనేజర్కు కారుడ్రైవర్గా పని చేశాడు. ఈ సమయంలో ముత్తారం తహసీల్దార్ ఆఫీసు ఎదుట జిరాక్స్ సెంటర్ నడిపే కుక్కడపు అశోక్, పెద్దపల్లిలో రబ్బర్ స్టాంపులు షాపు నడిపే బ్రాహ్మణపల్లి సుధాకర్, అప్పటి వీఆర్ఏ మడిగె సదన్న, అలియాస్ సదానందంతో కలిసి నకిలీ పాస్బుక్లు, వన్బీ పహాణీలు, ఆర్డీవో, తహసీల్దార్, డీటీ, వీఆర్వోల స్టాంపులను తయారు చేశారు. సర్వారం, కాజిపల్లి, పోతారం, లక్కారం, మచ్చుపేట, బేగంపేట, నవాబ్పేటకు చెందిన రైతులకు రుణాలు ఇప్పిస్తానని చెప్పి సర్వే నంబర్లు రాసి వాటిమీద ఆర్డీవో, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ సంతకాలను ఫోర్జరీ చేయించి దందాను నడిపేవాడు.
ఈ కేసులో ప్రవీణ్తో పాటు అతడికి సహకరించిన బియ్యాని రవీందర్, పెయ్యాల రమేశ్, గరికంటి సదయ్య, ప్రవీణ్కుమార్, సత్యనారాయణ, నూనె రాజేందర్, దొడ్ల శ్రీనివాస్, అనిల్కుమార్, కుక్కడపు అశోక్, మడిగె సదన్నను అదుపులోకి తీసుకొని వీరివద్ద నుంచి రూ.5.55 లక్షలు రికవరీ చేశారు. కాటారం మండలం చింతకానికి చెందిన మంథని శివకుమార్, బొమ్మాపూర్కు చెందిన కంకణాల రవీందర్రెడ్డి, గోదావరిఖని రాంనగర్కు చెందిన యశ్వంత్, సీనియర్ మేనేజర్ సముద్రాల రామాంజనేయచార్య, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎల్లారెడ్డిపేట బ్రాంచ్ మేనేజర్ గుడిపూటి వెంకటేశ్వర్లు పరారీలో ఉన్నారు. ఈ కేసు విచారణ చేపట్టిన తర్వాత మైదంబండ, లక్కారం, సర్వారం, బేగంపేట మచ్చుపేట, ముత్తారం, హరిపురం, అడవి శ్రీరాంపూర్, పోతారానికి చెందిన 30 మంది రైతులు రూ.37,91,991లను తిరిగి చెల్లించినట్లు తెలిపారు. ఇక్కడ డీసీపీ ఏఆర్ కమాండెంట్ సంజీవ్, పెద్దపల్లి డీసీపీ రవీందర్, మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్, ఆర్ఐ శ్రీధర్, రామగిరి ఎస్ఐ అర్కుటి మహేందర్ ఉన్నారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన సీసీఎస్ సీఐతోపాటు ఎస్ఐ అశోక్, కానిస్టేబుల్ సుధాకర్, అలెగ్జాండర్, శ్రీనివాస్, ఆంజనేయులు, అఖిలొద్దీన్, రవీందర్, సంపత్రెడ్డిని సీపీ, డీసీపీ అభినందించారు.