Kerala : అభిమాన హీరో లేదా డైరెక్టర్ సినిమా విడుదల అయ్యిందంటే చాలు థియేటర్లో వాలిపోతారు చాలామంది. అయితే.. చిన్నపిల్లలు ఉన్నవాళ్లు థియేటర్కు వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అందుకు కారణం.. సినిమా హాలు వాతావరణం చాలామంది పిల్లలకు పడదు. చీకటిగా ఉండడంతో పాటు లైట్స్, పెద్ద శబ్దాల కారణంగా పిల్లలు ఎప్పుడు ఏడుస్తారో తెలియదు. దాంతో, వాళ్లను తీసుకొని సినిమా హాలు నుంచి బయటకు రావాల్సి వస్తుంది. అయితే.. ఇప్పుడు వాళ్లు ఏ ఇబ్బంది లేకుండా హాయిగా సినిమా చూడొచ్చు. ఎందుకంటే… అక్కడి కైరల్ థియేటర్ కాంప్లెక్స్లో చంటి పిల్లలతో వచ్చే తల్లిదండ్రుల కోసం శబ్దాలు వినిపించని క్రైయింగ్ రూమ్ ఏర్పాటు చేశారు. దాంతో, ఈ థియేటర్ ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కాంప్లెక్స్ను ప్రభుత్వం నిర్వహిస్తుండడం విశేషం.
సినిమా మధ్యలో పిల్లలు గుక్కపెట్టి ఏడ్చినప్పుడు వెంటనే క్రైయింగ్ రూమ్లోకి వెళ్లి వాళ్లను సమూదాయించవచ్చు. అంతేకాదు ఆ గదిలో పిల్లలను నిద్రపుచ్చేందుకు తొట్టెలతో పాటు పిల్లల డైపర్ కూడా మార్చుకునేందుకు ఏర్పాట్లు చేశారు. కైరల్ థియేటర్ కాంప్లెక్స్లో పసిపిల్లల తల్లిదండ్రలు, వాళ్ల సంరక్షకుల కోసం కొన్ని సీట్లు కేటాయించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని థియేటర్లను మహిళలు, చినపిల్లలకు అనుకూలంగా మార్చేందుకు క్రైయింగ్ రూమ్ ఏర్పాటు చేశామని కేరళ సాంస్కృతిక శాఖ మంత్రి వీఎన్. వాసనవన్ సోమవారం తెలిపారు. త్వరలోనే మరిన్ని సినిమా హాళ్లలో క్రైయింగ్ రూమ్లను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.